ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ ర్యాలీలు
రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతుగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్కుమార్ యాదవ్ కోరారు. సోమవారం గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కేసీఆర్ వ్యవహారశైలికి నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. కేంద్రం అవలంబిస్తోన్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా ఈనెల 30న ఏఐసీసీ ఆధ్యర్వంలో నిర్వహించనున్న ‘భారత్ బచావో ర్యాలీ’కి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అనంతరం గాంధీభవన్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి మాథెర్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు.