72 గంటల్లో యువతి ఆచూకీ లభ్యం

Young Girl Left Home After Mother Scolds In Warangal - Sakshi

సాక్షి, మామునూరు(వరంగల్‌): తల్లి మందలించిందని ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన యువతిని 72గంటల్లోగా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ఆమె సికింద్రాబాద్‌ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లగా అక్కడి నుంచి రైలు ఎక్కినట్లు తెలిసింది. దీంతో రైల్వే పోలీసుల సాయంతో యువతిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఇది. ఈ మేరకు ఏసీపీ శ్యాంసుందర్, మామునూరు ఇన్‌స్పెక్టర్‌ సార్ల రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బీటెక్‌ చదువుతూ...
వరంగల్‌ లక్ష్మీపురం కాలనీకి చెందిన యువతి బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటేక్‌ చదువుతోంది. గత నెల 29న ఉదయం ఆమెను తల్లి మందలించడంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఈ మేరకు ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఈనెల 1వ తేదీ ఆదివారం సాయంత్రం మామునూరు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించగా స్కూటీపై ఆమె హన్మకొండ వెళ్లి ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట ఎస్‌బీఐ ఏటీఏం నుంచి  రూ.40వేలు డబ్బు డ్రా చేసినట్లు తేలింది. ఆ తర్వాత పుటేజీలు పరిశీలించగా ఆటోలో హన్మకొండ బస్టాండ్‌కి చేరుకుని సికింద్రాబాద్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో సికింద్రాబాద్‌ వెళ్లిన పోలీసులు అక్కడి హోటల్‌లో ఆరా తీయగా అప్పటికే గది ఖాళీ చేసి సికింద్రాబాద్‌ రైల్వే స్ట్రేషన్‌లో ఢిల్లీ వెళ్లేందుకు దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినట్లు తేలింది. ఆ వెంటనే సికింద్రాబాద్‌ కంట్రోల్‌ రూం నుంచి నాగపూర్‌ కంట్రోల్‌ రూంకు తెలియచేసి నాగపూర్‌ పోలీసులు సాయంతో యువతిని అదుపులోకి తీసుకుని బుధవారం తల్లిదండ్రులకు ఆప్పగించారు. కేసును 72 గంటల్లో పరిష్కరించిన ఇన్‌స్పెక్టర్‌ సార్ల రాజు, సిబ్బందిని ఏసీపీ శ్యాంసుందర్‌ అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top