వాటర్‌గ్రిడ్‌కు రూ.3, 470 కోట్లు


సింగూరుకు రూ. 1710 కోట్లు

ఎస్‌ఆర్‌ఎస్‌పీకి రూ.1760 కోట్లు

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

 

 బాన్సువాడ : జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 1645 గ్రామాలకు తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రూ.3,470 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో మిషన్ కాకతీయ పనులను, ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు సాగుకు అవసరమైనందున రూ.1710 కోట్లతో సింగూరు నుంచి వాటర్‌గ్రిడ్ పైప్‌లు వేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా బాన్సువాడ, బోధన్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 785 గ్రామాలకు నీరు సరఫరా చేస్తామని వివరించారు.



అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రూ.1760 కోట్లతో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 860 గ్రామాలకు నీరందిస్తామని తెలిపారు. ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఎల్‌అండ్‌టీ కంపెనీ వారు కాంట్రాక్టు పొందారని చెప్పారు. వాటర్ గ్రిడ్ పూర్తరుుతే నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు పూర్తిగా సాగుకే వినియోగిస్తామని, ఆయకట్టు కింద రైతులకు పుష్కలంగా నీరు లభిస్తుందని అన్నారు.



 రైతులకు రుణమాఫీ చేసినా, కొందరు బ్యాంకర్లు అమలు చేయలేదని, దీని కోసం శనివారం సాయంత్రం నిజామాబాద్‌లోని ప్రగతి భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.  



 బాన్సువాడలో 50 ఫీట్లతో రోడ్డు వెడల్పు..

 బాన్సువాడలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 50 ఫీట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నట్లు మంత్రి పోచారం స్పష్టం చేశారు. రోడ్డు వెడల్పు చేస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని, అందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నేతలు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, నార్ల సురేష్, సర్పంచ్ వాణి విఠల్, అలీముద్దీన్ బాబా  ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top