ఎంతో అభివృద్ధి చేశాం

TRS Developed Warangal - Sakshi

కాంగ్రెస్‌ నాయకుల విమర్శలు అర్థం లేనివి

అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్టుల నిర్మాణం

హైకోర్టు విభజన సాధించాం

ఎస్సీ, ఎస్టీలంటే అంత చిన్న చూపా

ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్‌

హన్మకొండ: పార్లమెంట్‌ సభ్యులుగా చాలా అభివృద్ధి చేశామని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స భ్యుడు ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాంనాయక్, వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పసునూరి దయాకర్‌ అన్నారు. శనివారం హన్మకొండలో ఎంపీ అజ్మీర సీతారాం నాయక్‌ స్వగృహంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఎంపీ సీతారాం నాయక్‌ మాట్లాడుతూ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సాధించామన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ సహకారంతో కేంద్రంపై ఒత్తిడి పెంచి హైకోర్టు విభజన సాధించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులు పడకేస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలు చేపడితే వాటి అనుమతులు తీసుకువచ్చామన్నారు.

గిరిజన యూనివర్శిటీ సా ధించామని తెలిపారు. వచ్చే జూన్‌ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. కాజీపేటకు పీరియాడికల్‌ ఒరాయిలింగ్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు రూ.290 కోట్లు నిధులు మం జూరు చేయించినట్లు పేర్కొన్నారు. వ్యాగన్‌ పరిశ్రమకు కావాల్సిన స్థల సేకరణకు రూ.28 కోట్లు అవసరమని ఇటీవల ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్‌ మాజీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్‌ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏం సాధించి తీసుకువచ్చారని ప్రశ్నించారు.

బాక్రానంగల్‌ ప్రా జెక్టులో ఏడు శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు సాధించామని చెప్పారు. ఢిల్లీ యూనివర్శిటీలో రిజర్వేషన్ల అమలుకు కృషి చేసినట్లు తెలిపారు. మహబూబాబా ద్‌కు పాస్‌పోర్టు సేవా కేంద్రం తీసుకువచ్చానని పేర్కొన్నారు. కేయూకు 207 పడకల హాస్టల్‌ మంజూరు చేయించామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఎం ప్యానల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ తీసుకువచ్చామని వివరించారు. వీటితో పాటు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశామని వివరించారు. పార్లమెంట్‌లో చర్చలో పాల్గొని తెలం గాణ అవసరాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని వివరించారు.

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు కాంగ్రెస్‌లోకి వచ్చిన వారిని ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని ప్రశ్నిం చారు. బాబు పొత్తుతో టీఆర్‌ఎస్‌ను ముంచాలనుకుంటే కాంగ్రెస్‌ కొంపే మునిగిందన్నారు. కేయూ భూములను ఆక్రమిం చింది ఎవరో తెలుసునని, త్వరలో జైల్లో పెట్టిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌కు ఇంకా బుద్ధి రావడం లేదని దుయ్యబట్టారు.

వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జాతీయ రోడ్లు మంజూరు చేయించామన్నారు. ఢిల్లీలో ఏ రోజు ఖాళీగా కూర్చోలేదని తెలిపారు. ఆజాంజాహి మిల్లును కాంగ్రెస్‌ మూసేస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు చేస్తుందన్నారు. వీటితో పాటు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న విమర్శలు పసలేనివని, విమర్శించాలె కాబట్టి విమర్శించినట్లుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఎన్ని నాటకాలు, డ్రామాలు ఆడినా ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించరని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎంపీపీ సారంగపాణి పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top