breaking news
MP DAYAKAR
-
‘తల్లి’ విగ్రహం ప్లాన్ సార్దే...: ఎంపీ దయాకర్
‘నేను వృత్తిరీత్యా చిత్రకారుడిని.. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్తగాఎంతో పేరొచ్చింది.. అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ మెచ్చిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. టీఆర్ఎస్లో అంచెలంచెలుగా ఎదిగిన నాకు 2014లో వర్దన్నపేట టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారింది.. అయినప్పటికీ రాజకీయంగా నేను ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది, అంతా సార్(కేసీఆర్) చూసుకుంటారు అని సరిపుచ్చుకున్నా. అంతే 2015 పార్లమెంట్ వరంగల్ ఉప ఎన్నికలో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచా. రెండోసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ అసాధారణ మెజారిటీతో వరంగల్ ఎంపీగా మళ్లీ గెలిచాను’– సాక్షి పర్సనల్ టైం’లో వరంగల్ లోక్సభ సభ్యుడు పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమ కాలంలో చురుగ్గా పాల్గొనే ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత ఇష్టుడిగా మారారు. అయినా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు. దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగారు. ఆ విధేయతే వరంగల్ ఎంపీ టికెట్ను తెచ్చిపెట్టింది. 2015 ఉప ఎన్నికలతో పాటు తాజా సాధారణ ఎన్నికల్లో ఎంపీగా అద్భుతమైన మెజార్టీతో గెలుపొందారు పసునూరి దయాకర్. ఈ సందర్భంగా తన చదువు, వివాహం.. ఉద్యమంలో తీరుతెన్నులు.. కేసులు ఎదుర్కొన్న వైనమే కాకుండా వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ‘సాక్షి పర్సనల్ టైమ్’లో పంచుకున్నారు. ఆ వివరాలు దయాకర్ మాటల్లోనే... సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి రాష్ట్రంలోని 25 మందిలో నేనొక్కడిని.. ఉమ్మడి వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన పసునూరి కమలమ్మ – ప్రకాశం మా అమ్మానాన్నలు. 1967 ఆగస్టు 2న జన్మించాను. హైదరాబాద్ జేఎన్టీయూలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 25 సీట్లు మాత్రమే ఉండేవి. అందులో ఒక సీటు రావడంతో బీఏ ఫైన్ ఆర్ట్స్ చదివా. హైదరాబాద్లో చదువు పూర్తి చేసుకుని వరంగల్కు చేరి ఫొటో స్టూడియో ఏర్పాటు చేసి చిత్రకారుడిగా వృత్తి ప్రారంభించాను. 2001 టీ ఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కీలకంగా పని చేశా. స్విమ్మింగ్ అంటే ఇష్టం పదో తరగతి వరకు మా ఊరు బొల్లికుంటలోనే చదువుకున్నా. ఆ రోజుల్లో చదువుతో పాటు స్నేహితులతో కలిసి ఊరిలో అన్ని ఆటలు ఆడా. స్విమ్మింగ్తో పాటు అన్ని ఆటలు ఇష్టమే. చిన్నప్పుడు కొద్దిగా రఫ్గానే ఉండేవాన్ని. కోతి కొమ్మచ్చి, తాటిముంజల కోసం చెట్లు ఎక్కడం ఇప్పటికీ మరిచిపోలేను. ఇంటర్మీడియట్ స్టేషన్ఘన్పూర్లో మా చిన్నాన్న దగ్గర చదుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్ జేఎన్టీయులో బీఏ ఫైన్ ఆర్ట్స్ సీటు రావడంతో అక్కడి వెళ్లా. లాస్ట్బెంచ్ స్టూడెంట్ను.. హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీలలో లాస్ట్బెంచ్లో కూర్చునేవాన్ని. చదువు, మార్కుల విషయంలో మాత్రం పర్ఫెక్ట్. స్టేషన్ఘన్పూర్లో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక హైదరాబాద్లో చదవాలనుకున్నా. జేఎన్టీయూలో బీఏ ఫైన్ ఆర్ట్స్ సీట్లు ఉమ్మడిరాష్ట్రంలో 25 సీట్లు మాత్రమే ఉం డేవి. అయినా అందులో సీటు కోసం ఎంట్రన్స్ రాస్తే 25 మం దిలో ఒకడిగా నాకు సీటు దక్కడం సంతోషాన్ని కలిగించింది. ‘సత్య’ సినిమా బాగా నచ్చింది చదువుకునే రోజుల్లో అన్ని ఆటలు ఆడేవాన్ని. స్విమ్మింగ్తో పాటు జిమ్కు కూడా వెళ్లేవాణ్ని. వాలీబాల్, అథ్లెటిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. వాలీబాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ పోటీల్లో పాల్గొన్నా. అథ్లెట్స్లో షాట్పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో కూడా ఇష్టంగా ఆడే వాళ్లం.రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా బాగా నచ్చింది. ప్రేమ, గీమల జోలికి వెళ్లలే... చదువుకునే రోజుల్లో ప్రేమ, గీమల జోలికి వెళ్లలేదు. ఆ రోజుల్లో కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు. కాలేజీకి వెళ్లిన సందర్భాల్లో ఎవరైనా తోటి విద్యార్థినులు పరిచయమైనా.. మరుసటి కనిపిస్తే కనీసం ‘హాయ్’ అని కూడా అనలేదు. ఎందుకంటే చదువుకోవడానికి హైదరాబాద్కు వచ్చినప్పుడు మిగతా వాటికి ప్రాధాన్యత అవసరం లేదని భావించేవాడిని. సేమ్ టైమ్ కేవలం పరిచయం చేసుకున్నంత మాత్రాన దానిని అవకాశంగా కూడా తీసుకోవడం సరికాదనే అనిపించేది. అందుకే వాటికి జోలికి వెళ్లలే. నాటుకోడి కూర బాగా ఇష్టం. పెద్దలు కుదిర్చిన పెళ్లి హైదరాబాద్లో బీఏ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి వరంగల్కు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నా. గౌరవంగా ఉంటుందని పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే అన్నా. అయితే, జయవాణి (భార్య) నాకు సీనియర్గా ఉన్న విద్యాదర్ చెల్లెలు అని ఆ తర్వాతే తెలిసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కనక వెంటనే జరిగిపోయింది. 1995 డిసెంబర్ 4 మా పెళ్లిరోజు. ఉద్యమ సమయంలో అన్నీ ఆమే తెలంగాణ ఉద్యమ సమయంలో నా భార్య జయవాణి కుటుంబాన్ని అంతా తానై చూసుకునేది. అటు ఉద్యమం.. ఇటు రాజకీయాల్లో నేను ముందుకు నడవడంలో ఆమె సహకారం మరవలేనిది. పిల్లలను చూసుకోవడం, ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తలను ఆదరించి మాట్లాడటం వల్ల నాకు కొంత వెసలుబాటు లభించేది. అసలు అర్ధరాత్రి దాటంది ఇంటికి చేరుకున్న రోజులు తక్కువ. మాదిగవారి కుంట మా ముత్తాత నాటిదే... దళిత కుటుంబంలో పుట్టినా బాగానే ఉన్నాం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు కలిపి మొత్తం ఆరుగురం. అందరం కూడా కారుల్లోనే తిరిగే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మా ముత్తాత షేర్ మల్లయ్య 90 – 100 ఎకరాల ఆసామి. ఆయన సంపాదించిన ఆస్తి మా తాతలు, తండ్రులు, మా వరకు వస్తోంది. ఇప్పటికీ ఆశాలపల్లి శివారులో ఉన్న మాదిగవారి కుంట మా ముత్తాత నుంచి వచ్చిందే. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. ఆస్తుల పంపకాలు లేవు. కలిసే ఉంటున్నాం. టీఆర్ఎస్, కేసీఆర్ చలవే.. షెడ్యూల్ కులంలో పుట్టినా మా కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఇదే సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదు. కనీసం సర్పంచ్ కూడా గెలవని నేను రెండు సార్లు ఎంపీగా ఎన్నిక కావడం అనేది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చలవ, ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వల్ల నాకు ఈ స్థాయి వచ్చింది. ఇది జీవితంలో గొప్ప అనుభూతి, అవకాశం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, కేసీఆర్ సార్ దృష్టిలో నాకు స్థానం దక్కడం నా అదృష్టం. నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కేసు నమోదైనా ఏ–1గా నా పేరే ఉండేది. అంతలా ఉద్యమంలో పాల్గొనేవాన్ని. ‘తల్లి’ విగ్రహం ప్లాన్ సార్దే... దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ప్లాన్ మా అధినేత కేసీఆర్ సార్దే. ఆయన ప్లాన్, సూచనలకు అనుగుణంగా విగ్రహాన్ని రూపొందించా. తెలంగాణ ఉద్యమం, ప్రజల ఆశలు, ఆశయాలకు ఆనుగుణంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం సృష్టికర్తగా కేసీఆర్ దగ్గర దక్కిన గుర్తింపు, పేరు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. అమ్మానాన్న, అన్న కొడుకు మరణం బాధించాయి... ఉమ్మడి కుటుంబంలో జీవితం హాయిగా సాగుతున్న సమయంలో అమ్మ కమలమ్మ, నాన్న ప్రకాశం మరణం విషాదాన్ని నింపింది. ఆరుగురి సంతానంలో ఆఖరి వాడినైన నాకు ఆ సమయంలో అమ్మనాన్నల మృతి తీవ్రంగా బాధించింది. సోషల్ మూమెంట్లో తిరిగే మా అన్న కొడుకు టిల్లు(21) చనిపోవడం కూడా తీవ్రంగా కలచివేసింది. మా అన్న బాగా సెన్సిటివ్. టిల్లు కొందరు యువకులతో గొడవ పడ్డారని వాళ్ల తల్లిదండ్రులు మా అన్నకు ఫిర్యాదు చేశారు. దీంతో అన్న టిల్లును మందలించగా ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న కుమారుడు టిల్లు చనిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఆయన బంగారం.. వర్ధన్నపేట టికెట్ మిస్సయితే బాధ పడ్డా...పసునూరి దయాకర్ సతీమణి జయవాణి ఉద్యమం, టీఆర్ఎస్లో 2014 వరకు కీలకంగా పని చేస్తున్న దయాకర్కు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ వస్తుం దని ఆశించాం. కేసీఆర్ సార్ కూడా దాదాపుగా దయాకర్కే ఇస్తామన్నారు. ఇదే సమయంలో పార్టీలో సమీకరణ కోణంలో అరూరి రమేష్కు కేటాయించారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. అయితే, ‘జయా.. సార్కు అన్నీ తెలుసు, ఎప్పుడు ఎవరికీ టికెట్ ఇవ్వాలన్నది కేసీఆర్ సార్కు బాగా తెలుసు.. సరైన సమయంలో న్యాయం చేస్తానన్నారు.. సార్ దృష్టిలో మనం ఉన్నాం.. టికెట్తో సంబంధం లేదు’ అని ఆయన(దయాకర్) నన్ను అనునయించారు. ఆ తర్వాత వెంటనే వచ్చిన 2015 వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా దయాకర్ పేరును కేసీఆర్ సార్ ప్రకటించడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మళ్లీ ఇప్పుడు టికెట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా ఎంపీగా గెలిపించారు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేసినందుకు గొప్ప గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఇక మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఉమ్మడి కుటుంబంలో ఈ ఇంటికోడలుగా రావడం ఆనందంగా ఉంది. రాజకీయంగా ఎక్కడికి వెళ్లినా.. ఏ సమయంలో వచ్చినా ఇంట్లోకి చేరగానే అవన్నీ మరచిపోయి చికాకు లేకుండా నాతో పాటు పిల్లలు రోని భరత్, ప్రీతమ్తో గడుపుతారు. అందుకే మా ఆయన బంగారం. పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ బాటలో సాగుతూ ఆయన ప్రజాజీవితంలో ఉండటం నిజంగా మా అదృష్టం. -
ఎంతో అభివృద్ధి చేశాం
హన్మకొండ: పార్లమెంట్ సభ్యులుగా చాలా అభివృద్ధి చేశామని మహబూబాబాద్ పార్లమెంట్ స భ్యుడు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. శనివారం హన్మకొండలో ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ స్వగృహంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సాధించామన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సహకారంతో కేంద్రంపై ఒత్తిడి పెంచి హైకోర్టు విభజన సాధించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు పడకేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలు చేపడితే వాటి అనుమతులు తీసుకువచ్చామన్నారు. గిరిజన యూనివర్శిటీ సా ధించామని తెలిపారు. వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. కాజీపేటకు పీరియాడికల్ ఒరాయిలింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు రూ.290 కోట్లు నిధులు మం జూరు చేయించినట్లు పేర్కొన్నారు. వ్యాగన్ పరిశ్రమకు కావాల్సిన స్థల సేకరణకు రూ.28 కోట్లు అవసరమని ఇటీవల ఎమ్మెల్యే వినయ్భాస్కర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏం సాధించి తీసుకువచ్చారని ప్రశ్నించారు. బాక్రానంగల్ ప్రా జెక్టులో ఏడు శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు సాధించామని చెప్పారు. ఢిల్లీ యూనివర్శిటీలో రిజర్వేషన్ల అమలుకు కృషి చేసినట్లు తెలిపారు. మహబూబాబా ద్కు పాస్పోర్టు సేవా కేంద్రం తీసుకువచ్చానని పేర్కొన్నారు. కేయూకు 207 పడకల హాస్టల్ మంజూరు చేయించామన్నారు. ఎన్ఎస్ఎస్ ఎం ప్యానల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ తీసుకువచ్చామని వివరించారు. వీటితో పాటు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశామని వివరించారు. పార్లమెంట్లో చర్చలో పాల్గొని తెలం గాణ అవసరాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లోకి వచ్చిన వారిని ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని ప్రశ్నిం చారు. బాబు పొత్తుతో టీఆర్ఎస్ను ముంచాలనుకుంటే కాంగ్రెస్ కొంపే మునిగిందన్నారు. కేయూ భూములను ఆక్రమిం చింది ఎవరో తెలుసునని, త్వరలో జైల్లో పెట్టిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్కు ఇంకా బుద్ధి రావడం లేదని దుయ్యబట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ రోడ్లు మంజూరు చేయించామన్నారు. ఢిల్లీలో ఏ రోజు ఖాళీగా కూర్చోలేదని తెలిపారు. ఆజాంజాహి మిల్లును కాంగ్రెస్ మూసేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తుందన్నారు. వీటితో పాటు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పసలేనివని, విమర్శించాలె కాబట్టి విమర్శించినట్లుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఎన్ని నాటకాలు, డ్రామాలు ఆడినా ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించరని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వినయ్భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎంపీపీ సారంగపాణి పాల్గొన్నారు. -
రియల్ హైదరాబాద్
మనో ఆర్య, మహి వర్మ ముఖ్య తారలుగా మనోహర్ చిమ్మని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నమస్తే హైదరాబాద్’. ప్రదీప్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ దయాకర్ విడుదల చేసారు. దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ –‘‘హైదరాబాద్ అంటే ఒక అద్భుతం, ఒక ఫ్యాంటసీ, ఓ అమ్మ వొడి. ఇక్కడ అడుగుపెట్టిన అందర్నీ వారి గమ్యానికి కచ్చితంగా చేరుస్తుంది. హైదరాబాద్లోని యువతీ యువకుల జీవితాలు ఎలా ఉంటాయి? అనే కథతో మనోహర్ ఈ చిత్రం తెరకెక్కిస్తుండటం హ్యాపీ’’ అన్నారు. మనోహర్ చిమ్మని మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో రియలిస్టిక్గా సాగే చిత్రమిది. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఆశలు, ఆశయాలతో యువతీ యువకులు హైదరాబాద్కి వస్తుంటారు. ఈ మహానగరం వారిని ఎలా ప్రభావితం చేసి, వారి జీవితాలను ఏ గమ్యాలను చేరుస్తుందన్నదే కథాంశం. సెప్టెంబర్లో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని ఆరు పాటలు హైదరాబాద్ని కొనియాడేలా ఉంటాయి’’ అన్నారు సంగీత దర్శకుడు, చిత్రనిర్మాత ప్రదీప్ చంద్ర. -
అతివలకే సింహభాగం
గుడుంబా నిర్మూలనతోనే సమస్యలకు పరిష్కారం ‘సర్వోదయ’ మహిళా దినోత్సవంలో ఎంపీ దయాకర్ ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు : ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంగెం(పరకాల) : పూర్వ కాలంలో వంటింటికే పరిమితమైన మహిళలకు ఇప్పుడు అన్ని రంగాల్లో సింహభాగం దక్కుతోందని.. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ వారు దూసుకువెళ్తున్నారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీ దయాకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు ప్రతిభ కనబరుస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గుడుంబా మహమ్మారి కారణంగా చిన్నవయస్సులోనే పలువురు వితంతువులుగా మారి దుర్భరజీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గుడుంబా నిర్మూలన జరిగిందని ఆయన అనగా.. ఇంకా పూర్తిగా బంద్ కాలేదని సభికుల నుంచి కొందరు చెప్పారు. దీంతో ఎంపీ స్పందిస్తూ పూర్తిస్థాయిలో నిర్మూలిస్తే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మహిళలు చైతన్యవంతులైనే అభివృద్ధి మహిళలు చైతన్యవంతులైతేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కుటుంబ సంక్షేమంతో పాటుగా పిల్లలు, భర్త సమాజంలో రాణింపు వెనక భార్య హస్తం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతీ ఒక్కరూ ఆడపిల్లల పట్ల వివక్షత చూపొద్దని కోరారు. గ్రామాల్లో గుడుంబా నిర్మూలన బాధ్యత పూర్తిగా మహిళలదేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పథకాలు మహిళల పేరునే మంజూరు ఇస్తున్నారని తెలిపారు. మహిళలు సంఘటితంగా ఉండి ప్రభుత్వ పథకాను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. మరుగుదొడ్లు తమ ఆత్మగౌరవానికి భావించి ప్రతీ ఇంట్లో నిర్మించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలకు నిర్వహించిన ఆటపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుగులోత్ వీరమ్మ, ఎంపీపీ బొమ్మల కట్టయ్య, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ భద్రునాయక్, సర్పంచ్ మల్లికాంబ, ఎంపీటీసీ సభ్యులు కళావతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సర్వోదయ సంస్థ కార్యదర్శి పల్లెపాడు దామోదర్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు.