టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ బాహాబాహీ | TRS And Congress Leaders Fighting In Warangal | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ బాహాబాహీ

Jan 26 2019 12:38 PM | Updated on Mar 6 2019 8:09 AM

TRS And Congress Leaders Fighting In Warangal - Sakshi

రఘునాథపల్లిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ వర్గీయుల ఘర్షణ  ఎమ్మెల్యే రాజయ్య వాహనాన్ని అడ్డగించిన కాంగ్రెస్‌ వర్గీయులు 

రఘునాథపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ వర్గాలు బాహబాíహీకి దిగాయి. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ వార్డు అభ్యర్థి సోదరుడు టీఆర్‌ఎస్‌ వార్డు అభ్యర్థితో వాగ్వివాదానికి దిగడంతో తోపులాట, ఘర్షణకు దారి తీసింది. పోలింగ్‌ జరుగుతోన్న సమయంలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన 8వ వార్డు అభ్యర్థి ఇమ్మడిశెట్టి శివరాం పోలింగ్‌ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడని అదే వార్డు కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి రంగు రాజు సోదరుడు శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారిరువురి మధ్య మాటమాట పెరిగి పోలింగ్‌ కేంద్రంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు వారిద్దరిని బయటకు పంపించారు.

విషయం తెలియడంతో ఇరు పార్టీల శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. జాతీయ ర«హదారిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రాళ్లతో పరస్పరం దాడి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీస్‌ సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆందోళనకారులను నిలువరించలేక పోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాహనాన్ని కాంగ్రెస్‌ వర్గాలు అడ్డుకున్నాయి. వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే వాహనం డోరు లాగేందుకు ప్రయత్నించగా ఆయన అంగరక్షకులు వారిని అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి మారుజోడు రాంబాబు, మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్‌లు ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా ఉన్నవారిని పోలీసులు పక్కకు జరిపి రాజయ్యను జనగామ వైపు పంపించారు. బయటకు వచ్చాక తనపై శివరాంతోపాటు అతడి అన్నలు తనపై దాడి చేశారని శ్రీనివాస్‌ ఆరోపిస్తుండగా.. ప్రచారం చేయకున్నా ఉద్దేశ పూర్వకంగా వాగ్వివాదానికి దిగారని శివరాం పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement