చలికాలంలోనూ ఉక్కపోత!
రాష్ట్రంలో పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీలు అధికం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలంలోనూ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవు తున్నాయి. బంగాళాఖాతంలో రెండ్రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడటంతో గాలిలో తేమ శాతం తగ్గింది. అలాగే తూర్పు దిశ నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మూడ్రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతాయని వివరించారు. గత 24 గంటల్లో హైదరాబాద్లో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 22 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది.
పగటి ఉష్ణోగ్రత కూడా 3 డిగ్రీలు అధికంగా 32 డిగ్రీలు రికార్డయింది. మహబూబ్నగర్లో రాత్రి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీలు, పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీలు నమోదైంది. రామగుండం, నిజామాబాద్ల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 20 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఆ రెండు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ అధికంగా 32 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హన్మకొండలో పగలూ రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అక్కడి పగటి ఉష్ణోగ్రత 33 కాగా, రాత్రి ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా రికార్డయింది.