మార్కెట్లో కొత్త మనీ గేమ్
దేశంలో తొలి వెదర్ డెరివేటివ్కు శ్రీకారం చుట్టిన ఎన్సీడెక్స్
మాన్సూన్ కూడా ఇప్పుడు మనీ మేకర్..
కొత్త ట్రెండ్ క్లైమేట్ ఫైనాన్స్
రైతులు, పవర్ కంపెనీలకు మార్కెట్లో కొత్త అవకాశాలు..
డేటా ఆధారిత ఫైనాన్స్ దిశగా భారత్..
స్టాక్ మార్కెట్ అంటే షేర్లు.. బంగారం.. కమోడిటీలు.. కరెన్సీలు మాత్రమే అనుకునే రోజులు మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, కార్బన్ క్రెడిట్లు, నీటి వినియోగం, విద్యుత్ ధరలు వంటి అంశాలపై కూడా ఫైనాన్షియల్ ఉత్పత్తులు వస్తున్నాయి. అదే దారిలో భారత్లో కూడా ‘‘వెదర్ డెరివేటివ్స్’’ అనే కొత్త కాన్సెప్ట్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది.
ముంబై వర్షపాతం ఆధారంగా ‘రెయిన్ ముంబై’ అనే వెదర్ డెరివేటివ్ను నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ (ఎన్సీడెక్స్) ప్రారంభించింది. వాతావరణ శాఖ (ఐఎండీ) డేటా ఆధారంగా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలో ఈ కాంట్రాక్టులు ట్రేడ్ అవుతాయి. రైతులకు మాత్రమే సంబంధించినవిగా పరిగణించే రుతుపవనాలు ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లలో కూడా ‘ట్రేడింగ్ థీమ్’గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ముందు ముందు దేశవ్యాప్తంగా వెదర్ డెరివేటివ్స్ని ప్రారంభించేందుకు కమోడిటీ ఎక్సే్చంజ్ కసరత్తు చేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఏమిటీ రెయిన్ ముంబై?
రెయిన్ ముంబై ఫ్యూచర్ కాంట్రాక్టు వర్షపాతం ఎక్కువా? తక్కువా? అన్న డేటాపై ఆధారపడి ట్రేడయ్యే ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ . రైతులు, పవర్ కంపెనీలు, నిర్మాణ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇలా వర్షాల ప్రభావానికి లోనయ్యే అన్ని రంగాలకు ఇది రిస్క్ మేనేజ్మెంట్ సాధనంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మార్కెట్ను అర్థం చేసుకునే ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలను అందిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకు వాతావరణ సంబంధిత ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు బీమా మాత్రమే ప్రస్తుతం నష్టపరిహారంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆధారిత ‘వెదర్ ట్రేడింగ్’ వారికి కొత్త రక్షణ కవచంగా నిలుస్తుందనేది మార్కెట్ వర్గాలు అంచనా.
ప్రపంచానికి పాతవే..
ప్రపంచ మార్కెట్లలో ఇలాంటి డెరివేటివ్స్ కొత్త విషయమేం కాదు. అమెరికా, యూరప్లలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు, గ్యాస్ ధరలు, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై ట్రేడింగ్ ఉత్పత్తులు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కార్బన్ క్రెడిట్ మార్కెట్లు అయితే బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారాయి. ఈకోవలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్న సమయంలో ‘‘క్లైమేట్ ఫైనాన్స్’’ వేగంగా విస్తరిస్తోంది.
ఇది పెట్టుబడులకు మాత్రమే కాకుండా, ధరల మార్పులు , వ్యాపార రిస్క్ల నుంచి రక్షణ పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. భారత్లో ఇప్పటివరకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వరకే పరిమితమయ్యారు. కానీ భవిష్యత్తులో యువ ఇన్వెస్టర్లు లక్ష్యంగా డేటా ఆధారిత కొత్త తరహా ఫైనాన్షియల్ ఉత్పత్తులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లు, మార్కెట్పై అవగాహన ఉన్నవారు ఇలాంటి విభిన్న ట్రేడింగ్ ఉత్పత్తులపై ఆసక్తి చూ పుతున్నారని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘ఆల్టర్నేటివ్ డెరివేటివ్స్’
⇒ వాతావరణం
⇒ కార్బన్ క్రెడిట్లు
⇒ విద్యుత్ వినియోగం
⇒ నీటి హక్కులు
⇒ ఈఎస్జీ/ సస్టెయినబిలిటీ ఇండెక్స్లు (పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, మరియు పారదర్శక పాలనా ప్రమాణాల ఆధారంగా కంపెనీల పనితీరును
అంచనా వేసే సూచీలు.)
⇒ పునరుత్పాదక ఇంధన వనరుల పత్రాలు
రిస్క్ ఎక్కువే
డెరివేటివ్స్ అంటే అధిక రిస్క్ సాధనాలు. అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఎలా పనిచేస్తుంది? ఒడిదుడుకులు ఎలా ఉంటాయి? వంటి అంశాలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ప్రవేశించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ అంచనాలతో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ మార్కెట్లో ప్రవేశించాలని హెచ్చరిస్తున్నారు.


