చేవెళ్ల ఎస్‌బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన | the farmers concerned in front chevella SBH | Sakshi
Sakshi News home page

చేవెళ్ల ఎస్‌బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన

Oct 2 2014 12:23 AM | Updated on Mar 28 2018 11:05 AM

రుణమాఫీ అంటూ రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ..

చేవెళ్లరూరల్: రుణమాఫీ అంటూ రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ‘నో డ్యూ’ సర్టిఫికెట్ ఇవ్వాలంటే కూడా డబ్బులు చెల్లించాలనే బ్యాంకు నిబంధనలతో అవాక్కయిన రైతులు బుధవారం చేవెళ్ల ఎస్‌బీహెచ్ ఎదుట ఆందోళన చేశారు. చేవెళ్లలోని ఎస్‌బీహెచ్ వద్దకు షాబాద్ మండలంలోని పలు గ్రామాల రైతులు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ కోసం వచ్చారు.

ప్రభుత్వం రుణమాఫీ, రీషెడ్యూల్ అమలు చేస్తుండటంతో మళ్లీ రుణాలు తీసుకునే రైతులకు ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదని నోడ్యూ సర్టిఫికెట్ తీసుకు రావాలని రుణాలు ఇచ్చే బ్యాంకులు ఆదేశిస్తున్నాయి. కాగా షాబాద్ మండలంలోని బ్యాంకులు, చేవెళ్ల బ్యాంకుల్లో కూడా ఈ నోడ్యూ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. రైతులు రుణాలు త్వరగా వస్తాయనే ఆశతో చేవెళ్ల మండల కేంద్రంలోని బ్యాంకుల వద్దకు వచ్చారు. ఇక్కడ అన్ని బ్యాంకుల వారు రైతుల వివారాలను తెలుసుకొని వారికి సంతకాలు చేసి పంపించారు.

సంతకం చేయాలంటే బ్యాంకు నిబంధనల ప్రకారం రూ.110 చెల్లిస్తే ఇస్తామని బ్యాంకు మేనేజర్ కిరణ్మయి చెప్పారు. కొంతమంది రైతులు చెల్లించారు. మరికొంత మంది రైతులు ఇదేంటని నిలదీశారు. ఇప్పటివరకు అన్ని బ్యాంకులకు తిరిగినా ఏ బ్యాంకు అధికారులూ డబ్బులు అడగలేదని, మీరు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.

దానికి నిబంధనల ప్రకారమే డబ్బులు అడుగుతున్నామని మేనేజర్ చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహించి రుణమాఫీ పేరుతో ఇలా రైతులకు బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేయటం బాగాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement