నోలైన్‌.. అన్నీ ఆన్‌లైన్‌ | Telangana RTA Providing Online Services | Sakshi
Sakshi News home page

నోలైన్‌.. అన్నీ ఆన్‌లైన్‌

Jun 4 2020 2:02 AM | Updated on Jun 4 2020 2:02 AM

Telangana RTA Providing Online Services - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రవాణా శాఖ అందజేసే పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. వాహన వినియోగదారులు ఆర్టీఏ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందొచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వాహనదారులు తమకు కావాల్సిన పౌరసేవల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్‌ ఫోన్‌ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్‌ సంతకాన్ని కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో వెంటనే వినియోగదారుల మొబైల్‌ ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ ద్వారా సమాచారం అందుతుంది. వినియోగదారుల దరఖాస్తులను, డాక్యుమెంట్లను పరిశీలించిన వారం రోజుల వ్యవధిలో స్మార్ట్‌ కార్డులను స్పీడ్‌ పోస్టు ద్వారా ఇళ్లకు పంపిస్తారు. దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఫీజులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. లెర్నింగ్‌ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల క్రయ విక్రయాలు వంటి వినియోగదారులు స్వయంగా రావాల్సిన పౌరసేవలు మినహాయించి సుమారు 17 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా వినియోగదారులకు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ట్రయల్స్‌ సైతం పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి.

ధ్రువీకరణ కోసమే సెల్ఫీ..
సాధారణంగా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవల కోసం వినియోగదారులు మొదట ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో, ఈ–సేవా కేంద్రాల ద్వారా నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఫీజులు చెల్లించాలి. స్లాట్‌లో నమోదైన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏకు వెళ్లి పత్రాలను అధికారులకు అందజేయాలి. అక్కడే ఫొటో దిగి, డిజిటల్‌ సంతకం చేయాలి. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వారం, 10 రోజులకు వినియోగదారుల ఇళ్లకే స్పీడ్‌ పోస్టు ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తారు. వినియోగదారుల నిర్ధారణ కోసం ఫొటోలు, డిజిటల్‌ సంతకాలే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌ సేవల్లో వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్‌ సంతకాన్ని తప్పనిసరి చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నియంత్రించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. మరోవైపు నకిలీ డాక్యుమెంట్లను అరికట్టేందుకు కూడా కీలకం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్‌ ద్వారా అందజేసే సమాచారంలో వినియోగదారులు కోరుకున్న సేవలను ధ్రువీకరిస్తూ ఒక నంబర్‌ కేటాయిస్తారు. ఒకవేళ ఆర్టీఏ ఆన్‌లైన్‌ సేవల్లో జాప్యం చోటు చేసుకున్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఈ నంబర్‌ ఆధారంగా వివరాలు పొందొచ్చు.

ఏయే సేవలకు ఆన్‌లైన్‌..
డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, 6 నెలల గడువు ముగిసిన లెర్నింగ్‌ లైసెన్సు కాలపరిమితి పొడిగింపు, లెర్నింగ్‌ లైసెన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వాహన రిజిస్ట్రేషన్‌ డూప్లికేట్‌ పత్రాలు, గడువు ముగిసిన వాటి రెన్యువల్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, అంతర్రాష్ట్ర సేవలపైన తీసుకోవాల్సిసిన నిరభ్యంతర పత్రాలు (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌), రవాణా వాహనాల పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు వంటి 17 రకాల సేవలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తేనున్నారు. వాహనాల ఫిట్‌నెస్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు వంటి వాటికి మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement