తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం | Telangana Old Secretariat Demolition Work Starts | Sakshi
Sakshi News home page

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం

Jul 7 2020 9:24 AM | Updated on Jul 7 2020 12:27 PM

Telangana Old Secretariat Demolition Work Starts - Sakshi

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సోమవారం అర్థరాత్రి నుంచి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలీసులను భారీగా మొహరించి సెక్రటేరియట్ దారులన్ని మూసివేశారు. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్‌, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను పోలీసులు మూసివేశారు. హైకోర్టు ఏడాది క్రితమే సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వం భూమిపూజ చేసింది. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం.. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. (సచివాలయంపై తొందరెందుకు?: హైకోర్టు)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పాలనా కేంద్రమైంది. మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయాన్ని నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సచివాలయాన్ని 10 బ్లాకులుగా నిర్మించారు. అతిపురాతనమైన జీ బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మించింది. 2003లో డీ బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్‌లను ప్రభుత్వం ప్రారంభిచింది. పాత సచివాలయాన్ని కూల్చివేసి అన్నీ హంగులతో నూతన సచివాలయం నిర్మాణంకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొత్తం 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనుంది. 6 లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయాన్ని నిర్మించి... సీఎం, అధికారులు,  మంత్రుల సమావేశం కోసం అధునాతన హిల్స్ నిర్మించనుంది. మంత్రుల పేచీలోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలతో నూతన సచివాలయం కట్టడానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. 

నూతన సచివాలయం నమూనా

వాహనాల మళ్లింపు, ట్రాఫిక్‌ జామ్‌
సచివాలయంలో కూల్చివేత లు నేపథ్యంలో ట్రాఫిక్ దారి మళ్లించారు. సచివాలయం నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందిరా పార్క్ నుంచి వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్, బషీర్‌బాగ్‌ పైపు మళ్లిస్తున్నారు. ఐ మాక్స్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, బషీర్‌బాగ్‌లోనూ వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఈ ప్రాంతాల్లో మంగళవారం  ఉదయం ట్రాఫిక్‌ స్తంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement