తెలంగాణ గుర్తింపుకార్డులు ఎందుకో? | Telangana identification cards, why? | Sakshi
Sakshi News home page

తెలంగాణ గుర్తింపుకార్డులు ఎందుకో?

Oct 9 2014 3:39 AM | Updated on Mar 29 2019 9:24 PM

ప్రజలకు తెలంగాణ గుర్తింపు కార్డులుకాదు, కరెంటు కావాలని కోరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు అన్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు
 
హైదరాబాద్: ప్రజలకు తెలంగాణ గుర్తింపు కార్డులుకాదు, కరెంటు కావాలని కోరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫాస్ట్ పథకంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందగోరే విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రా లను ఈ నెల 15లోగా..  కేవలం 6 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయడం సబబు కాదన్నారు. మొన్న సమగ్ర సర్వే, నిన్న ఫాస్ట్, నేడు గుర్తింపు కార్డులు అని ప్రజలను పరేషాన్ చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

గుర్తింపు కార్డులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తారు? ఒక వేళ తెలంగాణ ప్రజలకైతే తెలంగాణేతరుల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు కరెంటు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్  ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఈ నెల 11, 13, 14 తేదీలలో  మండల కేంద్రాల్లో బీజేపీ ధర్నాలు నిర్వహిస్తుందని ఆయన వివరించారు. సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అమర్‌సింగ్, ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement