చెకప్‌ చేసిన్రు.. మంచిగనే ఉంది | Telangana: Air Passenger Send Voice Message From Quarantine Goes Viral | Sakshi
Sakshi News home page

అన్నా నమస్తే.. అంత మంచిగనే ఉంది

Mar 20 2020 3:40 PM | Updated on Mar 20 2020 4:06 PM

Telangana: Air Passenger Send Voice Message From Quarantine Goes Viral - Sakshi

క్వారంటైన్‌ సెంటర్‌ బాగుందంటూ దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన సోదరుడికి వాయిస్‌ మెసేజ్‌ పంపించాడు.

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ బాగుందంటూ దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన సోదరుడికి వాయిస్‌ మెసేజ్‌ పంపించాడు. ఇది గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానం దిగిన అతడు తన సోదరుడిని డిస్ట్రబ్‌ చేయకూడదనే ఉద్దేశంతో ఈ మెసేజ్‌ పెట్టి.. లేచిన తర్వాత సందేశం ఇవ్వాలంటూ సూచించాడు. (కరోనా నిర్థారణ పరీక్షకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?)

అందులోని అంశాలు ఇవి..  ‘‘అన్నా నమస్తే... అంతా బాగేనా? ఇగో చేరుకున్నాం మంచిగ. ఫ్లైట్‌ రెండున్నరకు (తెల్లవారుజామున) ల్యాండ్‌ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో చెకప్‌ చేసిన్రు. కౌంటర్‌ మీద ఇమిగ్రేషన్‌ ఆఫీస్‌లో పాస్‌పోర్ట్‌ ఉంచుకుని, డిటేల్స్‌ రాసుకున్నాడు. మనకో పేపర్‌ ఇచ్చాడు. అదే పాస్‌పోర్ట్‌తో సమానం జాగ్రత్తగ పెట్టుకో అని చెప్పాడు. అక్కడ నుంచి లగేజ్‌ కాడికి వచ్చి తీసుకున్నం. ఆ తర్వాత ఇంకో లైన్‌ కట్టున్రి అని చెప్పిన్రు. అలా బయటకు వచ్చాం. అక్కడ ఎర్ర బస్సులు గదే క్వారంటైన్‌ వ్యాన్లు రెడీగా పెట్టారు. దుబాయ్, లండన్, యూఎస్‌ నుంచి ఎమిరేట్స్‌ ఫ్లైట్స్‌లో వచ్చిన అందరినీ అందులో తీసుకువచ్చి రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీకి తీసుకువచ్చి ఉంచిర్రు. ఇక్కడ మనిషికి సింగిల్‌ రూమ్, వైఫై, టీవీ, ఏసీ ఫెసిలిటీస్‌ అన్నీ ఉన్నయ్‌. స్నానం చేసి కూర్చున్నా. ఎన్ని రోజులు ఉంచుకుంటారో తెలీదు. ఖైదీలను తోల్కపోయినట్లు ముందొక పోలీసు గాడీ.. వెనుక మా బస్సు.. అలా ఎయిర్‌పోర్ట్‌ నుంచి 40 నిమిషాల్లో తోల్కొని వచ్చారు. గట్లుంది పరిస్థితి. ఇక చూడాలి ఎట్లుంటదో. ఏం టెన్షన్‌ తీసుకోకున్రీ. చెప్తా మల్లా విషయాలు. లేచినాక నాకు మెసేజ్‌ పెట్టు’’.  (విమానం దిగగానే క్వారంటైన్‌కే..)


పోలీసులకు కేటీఆర్‌ అభినందనలు
నాగోలు: కోవిడ్‌ వైరస్‌పై రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఎల్‌బీనగర్‌లో వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సూచనల మేరకు ఎల్‌బీనగర్‌ అదనపు సీఐ అంజపల్లి నాగమల్లు గురువారం కొత్తపేట, ఎల్‌బీనగర్‌ చౌరస్తా వద్ద వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు కోవిడ్‌ వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మైక్‌ ద్వారా వివరించారు.  ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. విషయం తెలుసుకున్న  మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా నాగమల్లుకు అభినందనలు తెలిపారు. (ఇజ్రాయిల్‌లో మనోళ్లకు కష్టాలు)

Advertisement
 
Advertisement
Advertisement