రోజు కాదు రెండురోజులు కాదు ఒక దేశం మరో దేశం కాదు...ఆ ఇద్దరు మిత్రులు ఫ్రాన్స్ నుంచి బయలుదేరి ఏడాదిన్నర పాటు నడుస్తూ 12000 కిలోమీటర్లు నడిచి చైనాకు చేరి తమ యాత్ర ముగించారు. లోయిక్ వాయిసాట్, బెంజిమిన్ హంబోల్ట్ ఈ ప్రయాణంలో గ్రహించింది ఏమిటంటే మనుషులు అట్టే చెడ్డవారు కాదని!
‘ప్రపంచాన్ని చూడాలని ఉంది. ప్రకృతితో మమేకమై బతకాలని ఉంది’ అని చాలామంది అంటూ ఉంటారు. కాని ఆ ఇద్దరు యువకులు మాత్రం దాన్ని చేసి చూపించారు. కష్టాలను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకోవడం ఎందుకు సాధ్యం కాదో నిరూపించడానికి ఈ ప్రయాణం చేశారు.
దేవుడిచ్చిన రెండు కాళ్లు ఎంత దూరం తీసుకెళ్లగలవో చూద్దామని కూడా వాళ్లు ఈ సుదీర్ఘ ప్రయాణానికి నడుము కట్టారు. కదలాలనే తలంపు ఉండాలేగాని రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లడానికి కాళ్లున్నాయని వీరు నిరూపించారు. అందుకే ఆ పాదాలకు నమస్కారం.
ఆ ఇద్దరు..
27 ఏళ్ల బెంజమిన్ హంబోల్ట్, 26 ఏళ్ల లోయిక్ వాయిసాట్ పారిస్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా ఏదో వెలితి. జీవితం మరీ రొటీన్ అయిపోతోందన్న తలంపు. అటు ప్రపంచాన్ని, ఇటు తమ అంతరంగాన్ని ఒకేసారి చూడాలన్న కోరిక. అందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు.
సెప్టెంబర్ 2024లో ఉద్యోగాలు వదిలేశారు. వారి స్వస్థలం అన్నేసీ నుండి ప్రయాణం మొదలుపెట్టారు. చైనాలోని షాంఘై చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందుకోసం వారు ఏ వాహనాన్నీ ఆశ్రయించలేదు. కేవలం కాలినడకనే ఐకానిక్ సిల్క్ రూట్ ద్వారా 16 దేశాలు దాటాలని నిశ్చయించుకున్నారు. 17 నెలలపాటు 8 వేల మైళ్లు (12వేల కిలోమీటర్లు) ప్రయాణం చేసిన వారు ఇటీవల వారు తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు.
ఏయే దేశాలు దాటి వచ్చారు?
ఫ్రాన్నష్ నుంచి నడక మొదలుపెట్టిన లోయిక్, బెంజిమిన్ తమ ప్రయాణంలో భాగంగా స్విట్జర్లాండ్, ఇటలీ, క్రొయేషియా, బోస్నియా, టర్కీ, రష్యా, ఉబ్జెకిస్థాన్, కిర్జిస్థాన్, కజికిస్థాన్ తదితర దేశాలు దాటారు.
చివరి మజిలిగా చైనానే ఎందుకు?
చైనానే తమ అంతిమ గమ్యస్థానంగా ఎందుకు చేసుకోవాలనుకున్నారని వారిని అడిగినప్పుడు వారి సమాధానం చాలా బలమైన చరిత్రకు సూచనగా నిలిచింది. ‘ఇది వైరుధ్యాల భూమి. ఇక్కడ పురాతన నాగరికత వేగవంతమైన ఆధునికీకరణను కలుస్తుంది. ఫ్రాన్స్లో ఉన్న మాకు ఈ నేలకు చేరుకోవాలని అనిపించింది. మా నిత్యజీవితాల్లో ఒత్తిడి నుంచి దూరం కావాలంటే ఇంత దూరం రాక తప్పదని మాకు అనిపించింది’ అని వారు వివరించారు.
మనుషులు మంచివాళ్లే
ఈ ప్రయాణం లోయిక్, బెంజిమిన్కు ఎన్నో గొప్ప అనుభవాలు ఇచ్చింది. ‘మేము దారిలో మనుషులను కేవలం మంచినీళ్లు అడిగేవాళ్లం. వాళ్లు మా యాత్ర గురించి తెలుసుకుని నీళ్లతో΄ాటు ఎన్నెన్నో ఇచ్చేవారు. మనుషులు మంచివాళ్లు’ అన్నారు వాళ్లిద్దరు. జిన్జియాంగ్ రాజధాని ఉరుంకిలోని ఒక హోటల్లో దిగినప్పుడు అక్కడి సిబ్బంది వారిని హృదయపూర్వకంగా స్వాగతించారు. అంతేకాకుండా స్థానిక పోలీసు అధికారులు మూన్ కేక్లు, అక్కడి సాంప్రదాయ పెరుగును బహుమతిగా ఇచ్చారు.
ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది మంచి మనుషులు తమకు సాయం చేశారని, అందువల్లే తాము సురక్షితంగా గమ్యం చేరామని అంటున్నారు. బోస్నియాలో ల్యాండ్మైన్స్ ఉంటాయన్న విషయం తమను భయపెట్టిందని, అయితే ప్రమాదమేమీ జరగకుండా సురక్షితంగా వచ్చామని తెలిపారు. తమ నడకలో తాము గొప్పగా ఆస్వాదించింది సూర్యోదయాలను అని వారన్నారు. బాగా నడిచి నిద్రకు సిద్ధమైతే ఆ కమ్ముకొచ్చే నిద్ర గొప్పగా ఉంటుందని కూడా అన్నారు. నిద్ర పట్టక, ఉన్న చోటునే ఉండి వ్యాయామం ఎరగక ఉంటున్నవారు వీరిలా కాకపోయినా కొంతైనా నడిచినా అదే తమకు తాము ఇచ్చుకునే గొప్ప కానుక.
(చదవండి: భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..)


