యుద్ధప్రాతిపదికన ‘గట్టు’ ఎత్తిపోతలు  | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన ‘గట్టు’ ఎత్తిపోతలు 

Published Wed, Dec 5 2018 8:21 AM

 Strike 'Gattu Lift Irrigation' on the Battlefield - Sakshi

సాక్షి, గద్వాల: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తుమ్మిళ్ల ప్రాజెక్టులు పనులు పూర్తి చేసినట్లు యుద్ధప్రాతిపదికన నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి 38వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో మంగళవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. మళ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని ఈసారి గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, ఒకే వేళ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగనని అన్నారు.

ఇప్పటికే నెట్టెంపాడు లిఫ్ట్‌ ద్వారా రెండు టీఎంసీలు ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీలకు పెంచుకొని నియోజకవర్గంలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా నడిగడ్డ సస్యశ్యామలం అవుతుందన్నారు. 


కృష్ణమోహన్‌రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి 
తెలంగాణ రాష్ట్రం రాకపోతే, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కావడం వల్లే గద్వాల జిల్లా ఏర్పడిందని కేసీఆర్‌ తెలిపారు. అందుకు గద్వాల నియోజకవర్గ ప్రజలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజారీటీతో గెలిపించి కృతజ్ఞత తెలపాలని పిలుపునిచ్చారు. ఓడిపోయినప్పటికి ప్రజల మద్య ఉంటూ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకురావడానికి కృష్ణమోహన్‌రెడ్డి కృషి చేస్తున్నాడని, గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు చేయించడంలో కృష్ణమోహన్‌రెడ్డి కృషి ఎంతగానో ఉం దని అన్నారు.

ఇక్కడికి వచ్చే ముందు తెప్పించుకున్న సర్వేలో కృష్ణమోహన్‌రెడ్డి గెలుస్తున్నట్లు తేలిందని, ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తే ని యోజకవర్గంలో కృష్ణమోహన్‌రెడ్డి గెలుపు ఖాయ మని తేలిపోయిందని అన్నారు. దశాబ్ధాల పాటు నియోజకవర్గాన్ని పాలిస్తున్న వారు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, ఎన్ని రోజులు ఈ పాత చింతకాయపచ్చడి, కొత్త వారికి, నిత్యం ప్రజల్లో ఉన్న వారికి అవకాశం కల్పించాల్సిన అవసరమున్నందున కృష్ణమోహన్‌రెడ్డిని భారీ మెజారీటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.  


మోదీ అబద్ధాలు... 
తెలంగాణలో కరెంటు సమస్య ఉందంటూ ప్రధానమంత్రి మోడీ అబద్దాలు మాట్లాడుతున్నారని, దేశ ప్రధానులే అబద్ధాలు మాట్లాడటం దురదుష్టకరమని కేసీఆర్‌ అన్నారు. దశాబ్ధాలుగా పాలకులుగా ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో వెనక్కి నెట్టివేసిన కాంగ్రెస్, టీడీపీలకు తగిన బుద్ది చెప్పాలని కోరారు.

అడుగడుగున ప్రాజెక్టులకు అడ్డం పట్ట చంద్రబాబుతో కాంగ్రెస్‌ జతకట్టడం సిగ్గుచేటని ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. ఇంకా ఈ సభలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, కార్పొరేషన్ల చైర్మన్లు రాకేష్, గట్టు తిమ్మప్ప, బండ్ల జ్యోతి, బీ.ఎస్‌.కేశవ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పర్మాల నాగరాజు, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, సుభాన్‌ పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement