
‘జైళ్ల’ ఉత్పత్తులకు మస్త్ డిమాండ్
దేశంలోని ఏ జైళ్ల శాఖ చేయని సాహసోపేత కార్యక్రమాలను రాష్ట్ర జైళ్ల శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఖైదీలతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేయించి మార్కెట్లో అమ్మడం ద్వారా రెండేళ్లలోనే రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని గడించింది.
ఖైదీల ద్వారా తయారీ..రెండేళ్లలో రూ.100 కోట్ల ఆదాయం
ఉపాధి, ఆదాయమే లక్ష్యమన్న జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఏ జైళ్ల శాఖ చేయని సాహసోపేత కార్యక్రమాలను రాష్ట్ర జైళ్ల శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఖైదీలతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేయించి మార్కెట్లో అమ్మడం ద్వారా రెండేళ్లలోనే రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని గడించింది. త్వరలో 10 పెట్రోల్ బంకులు, ఆయుర్వేద కేంద్రాలను ప్రారంభించి మరింత ఆదాయాన్ని పొందేందుకు, ఉపాధి కల్పలనను ప్రారంభించబోతోంది.
ఊరికో ఔట్లెట్..: జైళ్లలో ఖైదీలు తయారు చేస్తున్న బేకరీ ఐటమ్స్, ఫినాయిల్, సబ్బులు, బెడ్షీట్లు, టవల్స్, కూరగాయలు, ఫర్నిచర్ల లాంటి ఉత్పత్తులకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం వీటిని నగరంలోనే విక్రయిస్తున్నామని, ఇకనుంచి గ్రామాల్లోకి తీసుకెళ్లి మరింత ఆదాయం పొందడంతో పాటు గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి లభించేలా చర్యలు చేపడుతున్నామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. తమ ఉత్పత్తులను ప్రతీ గ్రామానికి పంపి వాటిపై 10 శాతం కమిషన్ సంబంధిత ఔట్లెట్ నిర్వాహకులకు ఇవ్వాలని యోచిస్తున్నా మన్నారు. తొలుత పాత జిల్లాల ప్రకారం పది జిల్లాల్లో జిల్లా జైలు కింద ఒక్కో గ్రామానికి ఒక ఔట్లెట్ ఏర్పాటు చేసి అక్కడి స్పందన ఆధారంగా వచ్చే ఔత్సాహికులకు ఔట్లెట్లు అప్పగిస్తామని చెప్పారు.
ప్రస్తుతం జైళ్ల శాఖలో ఖైదీలకు ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వం నుంచి తమ విభాగానికి నిధులు లేకున్నా రాబడితో ముందుకు వెళ్తున్నామని సింగ్ తెలిపారు. ప్రస్తుతం జైళ్ల శాఖ కింద 10 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా ఏటా రూ.8 – రూ.10 కోట్ల ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. త్వరలో చంచల్గూడ మహిళా జైలు ఆధ్వర్యంలో ఉమెన్ పెట్రల్ బంకు ప్రారంభిస్తామని, మాజీ మహిళా ఖైదీలకూ ఉపాధి కల్పిస్తామని డీజీ వీకే సింగ్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు.