Department of Prisons DG VK Singh
-
జైళ్ల శాఖ డీజీకి మీడియా సెగ
సాక్షి, హైదరాబాద్: ఒక మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను కమర్షియల్ సెక్స్ వర్కర్లంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ను జర్నలిస్టులు ఘెరావ్ చేశారు. కలప రవాణాకు సంబంధించి ఓ మీడియా సంస్థ ప్రసారం చేసిన కథనాలపై వివరణ ఇచ్చేందుకు సోమవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ హెడ్క్వార్టర్స్లో వీకే సింగ్ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఈ మీడియా సమావేశానికి వెళ్లిన జర్నలిస్టులు వీకే సింగ్కు నిరసన తెలిపారు. సెక్స్ వర్కర్లంటూ సంబోధించిన అంశాలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి వీకే సింగ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సంబంధిత మీడియా సంస్థ, ఆసంస్థ జర్నలిస్టుతో ఏకీభవిస్తున్న వాళ్లందరూ బ్లాక్మెయిలర్లతో సమానమంటూ మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించారు. దీనితో జర్నలిస్టులకు, వీకే సింగ్, ఇతర అధికారులతో వాగ్వాదం జరిగింది. క్షమాపణ చెప్పేంతవరకు జైళ్ల శాఖకు సంబంధించిన మీడియా కవరేజీలు చేసేది లేదని జర్నలిస్టులు స్పష్టం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన డీజీ ఆ ఛాన ల్పై మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ చానల్కి మద్దతు పలికే మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండానే సింగ్ వెనుదిరిగి వెళ్లిపోయారు. మీడియా బాగుకోసం పోరాడతా: వీకే సింగ్ తాను కేవలం ఒక మీడియా సంస్థ, ఆ జర్నలిస్టులనుద్దేశించి మాత్రమే కామెంట్ చేశానని, ఆ సంస్థ బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతోందని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వారితో మరో మీడియా ఏకీభవించడం సమాజానికి మంచిది కాదని, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా ఎన్నో ఉద్యమాలను ప్రసారం చేసి తెలంగాణ వచ్చేలాగా చేసిందని, కానీ ఒక మీడియా చేసిన పనివల్ల మొత్తం మీడియా అలా బ్లాక్మెయిలింగ్ వైపు వెళ్లకూడదని కోరుతున్నానన్నారు. ‘సేవ్ మీడియా’పేరుతో తాను ఉద్యమం చేస్తానని, సంబంధిత మీడియా వల్ల నష్టపోయిన వాళ్లుంటే తనను ఆశ్రయించాలని సూచించారు. అదేవిధంగా చానల్ నడిపేందుకు డబ్బులు కావాలంటే తాము చందాలిస్తామని, అంతేగానీ ఇలా బ్లాక్మెయిలింగ్కు పాల్పడవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. అకారణంగా తనను అప్ర తిష్టపాలు చేసిన ఆ న్యూస్ చానల్పై యుద్ధం చేస్తానని సింగ్ తెలిపారు. తనపై ఆ ఛానల్ తప్పుడు వార్త ప్రసారం చేసిందని, నిరాధారమైన ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించిన ఆ చానల్పై యుద్ధం ప్రకటించినట్లు తెలిపారు. ఆ చానల్ను వ్యభిచారులతో పోల్చినందుకు వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. -
‘జైళ్ల’ ఉత్పత్తులకు మస్త్ డిమాండ్
ఖైదీల ద్వారా తయారీ..రెండేళ్లలో రూ.100 కోట్ల ఆదాయం ఉపాధి, ఆదాయమే లక్ష్యమన్న జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఏ జైళ్ల శాఖ చేయని సాహసోపేత కార్యక్రమాలను రాష్ట్ర జైళ్ల శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఖైదీలతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేయించి మార్కెట్లో అమ్మడం ద్వారా రెండేళ్లలోనే రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని గడించింది. త్వరలో 10 పెట్రోల్ బంకులు, ఆయుర్వేద కేంద్రాలను ప్రారంభించి మరింత ఆదాయాన్ని పొందేందుకు, ఉపాధి కల్పలనను ప్రారంభించబోతోంది. ఊరికో ఔట్లెట్..: జైళ్లలో ఖైదీలు తయారు చేస్తున్న బేకరీ ఐటమ్స్, ఫినాయిల్, సబ్బులు, బెడ్షీట్లు, టవల్స్, కూరగాయలు, ఫర్నిచర్ల లాంటి ఉత్పత్తులకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం వీటిని నగరంలోనే విక్రయిస్తున్నామని, ఇకనుంచి గ్రామాల్లోకి తీసుకెళ్లి మరింత ఆదాయం పొందడంతో పాటు గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి లభించేలా చర్యలు చేపడుతున్నామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. తమ ఉత్పత్తులను ప్రతీ గ్రామానికి పంపి వాటిపై 10 శాతం కమిషన్ సంబంధిత ఔట్లెట్ నిర్వాహకులకు ఇవ్వాలని యోచిస్తున్నా మన్నారు. తొలుత పాత జిల్లాల ప్రకారం పది జిల్లాల్లో జిల్లా జైలు కింద ఒక్కో గ్రామానికి ఒక ఔట్లెట్ ఏర్పాటు చేసి అక్కడి స్పందన ఆధారంగా వచ్చే ఔత్సాహికులకు ఔట్లెట్లు అప్పగిస్తామని చెప్పారు. ప్రస్తుతం జైళ్ల శాఖలో ఖైదీలకు ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వం నుంచి తమ విభాగానికి నిధులు లేకున్నా రాబడితో ముందుకు వెళ్తున్నామని సింగ్ తెలిపారు. ప్రస్తుతం జైళ్ల శాఖ కింద 10 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా ఏటా రూ.8 – రూ.10 కోట్ల ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. త్వరలో చంచల్గూడ మహిళా జైలు ఆధ్వర్యంలో ఉమెన్ పెట్రల్ బంకు ప్రారంభిస్తామని, మాజీ మహిళా ఖైదీలకూ ఉపాధి కల్పిస్తామని డీజీ వీకే సింగ్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు.