ఎన్నికల వేళ‘పంచాయతీ’ బదిలీలా?  | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ‘పంచాయతీ’ బదిలీలా? 

Published Thu, Jun 21 2018 1:27 AM

State Election Commission Serious on Panchayat Officers issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డివిజనల్‌ పంచాయతీ అధికారులకు జిల్లా పంచాయతీ అధికారులుగా పదోన్నతులు ఇచ్చి ఇతర జిల్లాలకు బదిలీ చేయడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరిన కమిషన్, బదిలీ అయిన అధికారులను తమ అనుమతి లేకుండా రిలీవ్‌ చేయవద్దని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రంలోని ఆరుగురు డివిజనల్‌ పంచాయతీ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరు ఆయా జిల్లాల ఇన్‌చార్జి పంచాయతీ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదో న్నతులిచ్చిన నేపథ్యంలో వారు పనిచేస్తున్న స్థానాలనూ మారు స్తూ బదిలీ ఉత్తర్వులిచ్చారు.

ఈ ఉత్తర్వులపైనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ అయింది. సాధారణ బదిలీల నుంచి పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బందిని మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, దీన్ని పట్టించుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం సరైంది కాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌కుమార్‌ జిల్లాల కలెక్టర్లకు బుధవారం పంపిన లేఖలో పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ చేయడం జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ప్రభావం చూపుతుందని, దీంతో బదిలీలపై స్టే విధిస్తున్నామని పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా బదిలీ అయిన అధికారులను రిలీవ్‌ చేయవద్దన్నారు. వారు పనిచేస్తున్న స్థానాల్లో మార్పు లేకుండా ఆయా అధికారులకు పదోన్నతులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.   

Advertisement
Advertisement