
మంత్రుల క్వార్టర్లలో పాములు
మంత్రుల అధికారిక నివాసాల సముదాయంలో పలు విషపూరితమైన పాములు సంచరిస్తుండటంతో శనివారం పాముల వేట ప్రారంభమైంది.
బంజారాహిల్స్ (హైదరాబాద్): హైదరాబాద్లోని మంత్రుల అధికారిక నివాసాల సముదాయంలో పలు విషపూరితమైన పాములు సంచరిస్తుండటంతో శనివారం పాముల వేట ప్రారంభమైంది. బంజారాహిల్స్లోని రోడ్నంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్కు.. నెహ్రూ జూలాజికల్ పార్కులో పనిచేసే పాములు పట్టేవారిని రప్పించారు.
క్వార్టర్లలోని చెట్ల పొదలు, కంప చెట్లు, ఎవరూ నివాసం ఉండని భవనాల్లో గాలించి మధ్యాహ్నం వరకు వారు రక్తపింజర, జెర్రి గొడ్డు, కట్ల పాము లాంటి వాటిని పట్టుకున్నారు. నాగుపాము, నల్లత్రాచులాంటివి కూడా సంచరిస్తున్నాయని అక్కడి సిబ్బంది చెబుతుండటంతో వాటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.