ఐఐటీ, ఎన్‌ఐటీల్లోని సీట్ల కేటాయింపు  | Sakshi
Sakshi News home page

ఐఐటీ, ఎన్‌ఐటీల్లోని సీట్ల కేటాయింపు 

Published Thu, Jun 28 2018 1:10 AM

Seat allotment in IIT and NIT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీ ఐల్లోని సీట్లు అన్నింటికి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథా రిటీ (జోసా) విద్యార్థులకు కేటాయించింది. ఉమ్మడి ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 25 వరకు ఆప్షన్లకు అవకాశం కల్పించిన జోసా బుధవారం సీట్ల కేటాయింపును ప్రకటించింది. ఇందులో వరంగల్‌లోని ఎన్‌ఐటీ, హైదరాబాద్‌లోని ఐఐటీల్లో ఉన్న సీట్లతోపాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లోని 37 వేల సీట్ల ను విద్యార్థులకు కేటాయించింది. సీట్లు పొందిన వారు ఈ నెల 28 నుంచి జూలై 2 లోగా రిపోర్టింగ్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకొని యాక్సెప్టెన్సీ ఇవ్వాలని సూచించింది.

ఇందుకోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో, వరంగల్‌ ఎన్‌ఐటీలో రిపోర్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూలై 3న ఉదయం భర్తీ అయిన సీట్లను, ఖాళీగా ఉన్న సీట్లను ప్రకటించనుంది. అదే రోజు సాయంత్రం రెండో దశ సీట్లను కేటాయించనుంది. ఈసారి కౌన్సెలింగ్‌ను 7 దశల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. మొదటి దశలో వచ్చిన సీటు వద్దనుకుంటే సంబంధిత రిపోర్టింగ్‌ కేంద్రంలో తెలియజేయాలని అధికారులు వెల్లడించారు. ఆయా విద్యార్థులు మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు లేదని, మొదట ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకొని ఆ తరువాతి దశల్లో సీట్లు కేటాయిస్తారన్నారు.

Advertisement
Advertisement