మన రైళ్లకు ప్రైవేటు కూత..!

SCR Officials Prepare Train Services List To Be Privatised - Sakshi

ఏయే రైళ్లు అప్పగించవచ్చో జాబితా ఇవ్వాలన్న రైల్వే బోర్డు

జోనల్‌ కార్యాలయాలకు లేఖలు.. నేడు ఢిల్లీలో సమావేశం 

జాబితా సిద్ధం చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు

ఎంఎంటీఎస్‌ను కూడా జాబితాలో చేర్చిన అధికారులు? 

18 రైల్వే జోన్లకుగాను 6 జోన్లు.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేతోపాటు సెంట్రల్‌ రైల్వే, నార్తర్న్‌ రైల్వే, నార్త్‌ సెంట్రల్‌ రైల్వే, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, సదరన్‌ రైల్వేలో పలు రైళ్లు ప్రైవేట్‌ కూత పెట్టనున్నాయి. నేడు ప్రతిపాదనలు సమర్పించే అవకాశం.

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేటు పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. తన అనుబంధ సంస్థ అయిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌కు సెమీ హైస్పీడ్‌ తేజస్‌ రైళ్లను కట్టబెట్టిన రైల్వే..మరిన్ని రైళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైంది. త్వరలో బిడ్డింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో రైల్వే బోర్డు కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఏయే రైళ్లను ప్రైవేటుకు అప్పగించొచ్చనే జాబితాతో సమావేశానికి హాజరు కావాలని రైల్వే బోర్డు జోనల్‌ కార్యాలయాలకు లేఖలు పంపింది. సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయానికి రెండ్రోజుల కింద ఈ మేరకు లేఖ అందింది. దీంతో మన జోన్‌ ఆపరేషన్‌ విభాగం అధికారులు శుక్రవారం ఢిల్లీ లో జరగనున్న సమా వేశానికి వెళ్లను న్నారు. 

రద్దీ మార్గాలే టార్గెట్‌.. 
సరుకు రవాణాలో రైల్వేది ఏక ఛత్రాధిపత్యం. బొగ్గు, సిమెంట్, ముడి ఇనుము సహా ఇతర సరుకులు భారీగా రవాణా జరుగుతోంది. సరుకు రవాణా రైల్వేకు భారీగా ఆదాయాన్ని మోసుకొస్తోంది. అయితే నామమాత్రపు టికెట్‌ ధరతో నడుస్తున్న ప్రయాణికుల రైళ్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. దీంతో ప్రయాణికుల రైళ్లను వదిలించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు వాటిని కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మంచి ఆదాయం ఉన్న రైళ్ల కోసమే ప్రైవేటు సంస్థలు కూడా చూస్తుంటాయి. అందుకే మంచి ఆక్యుపెన్సీ రేషియో ఉన్న మార్గాలను ప్రైవేటీకరించాలని రైల్వే నిర్ణయించింది. మంచి రైళ్ల జాబితా ఇవ్వాల్సిందిగా జోనల్‌ కార్యాలయాలకు లేఖ రాసింది. 

ఇవీ ఫుల్లుగా నిండుతాయి..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌–వైజాగ్, సికింద్రాబాద్‌–ఢిల్లీ మార్గాల్లో నడుస్తున్న రైళ్లన్నీ 100% ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌)తో నడుస్తున్నాయి. వైజాగ్‌ మార్గంలో 20 రైళ్లు, ఢిల్లీ దారిలో 6 రైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా మంచి డిమాండ్‌ ఉంది. 

ఎంఎంటీఎస్‌ కూడా? 
నాంపల్లి–లింగంపల్లి–ఫలక్‌నుమా మధ్య తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లలో నిత్యం 1.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీటి సంఖ్యను, బోగీల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ ఉన్నా, లైన్ల కొరత, కొత్త రైళ్ల కొనుగోలుకు నిధుల కొరత కారణంగా సాధ్యపడలేదు. ఎంఎంటీఎస్‌ రెండో దశ అందుబాటులోకి వస్తే దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు నిత్యం వీటిల్లో ప్రయాణించే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్‌ను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రైల్వే బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. 

ఆరు జోన్లపై దృష్టి.. 
దేశంలో 18 రైల్వే జోన్లు ఉన్నా.. ప్రస్తుతానికి ఆరు జోన్ల పరిధిలోనే ప్రైవేటు రైళ్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రైల్వే బోర్డు ఆరు జోన్లకే లేఖలు రాసింది. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కాకుండా.. సెంట్రల్‌ రైల్వే, నార్తర్న్‌ రైల్వే, నార్త్‌ సెంట్రల్‌ రైల్వే, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, సదరన్‌ రైల్వేలకు ఈ లేఖలు అందాయి. 

ఏం జరుగుతుంది 

  • ప్రస్తుతం ఆయా మార్గాలను నిర్వహించటం ద్వారా రైల్వే పొందుతున్న ఆదాయానికంటే కొంత మొత్తం స్థిరీకరించి ప్రైవేటు సంస్థ రైల్వేకు చెల్లిస్తుంది. తర్వాత తన ఆదాయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఛార్జీలు భారీగానే పెరుగుతాయి. 
  • విమానాల్లో అమల్లో ఉండే డైనమిక్‌ ఫేర్‌ విధానం లాంటి వాటిని ప్రవేశపెడతారు. డిమాండ్‌ ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటా యి. టికెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మామూ లు రేటు, టికెట్లు కొన్నే ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి. 
  • మంచి భోజనం అందు బాటులోకి వస్తుంది. 
  • రైళ్లలో వసతులు మెరుగవుతాయి. రైళ్లలో సీట్‌ కవర్లు, దుప్పట్లు, ఫ్యాన్లు, లైటింగ్, ఏసీ, పరిశుభ్రత మెరుగవుతాయి.
  • ప్రస్తుతం ఆయా మార్గాలను నిర్వహించటం ద్వారా రైల్వే పొందుతున్న ఆదాయానికంటే కొంత మొత్తం స్థిరీకరించి ప్రైవేటు సంస్థ రైల్వేకు చెల్లిస్తుంది. తర్వాత తన ఆదాయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఛార్జీలు భారీగానే పెరుగుతాయి. 
  • విమానాల్లో అమల్లో ఉండే డైనమిక్‌ ఫేర్‌ విధానం లాంటి వాటిని ప్రవేశపెడతారు. డిమాండ్‌ ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటా యి. టికెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మామూ లు రేటు, టికెట్లు కొన్నే ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి. 
  • మంచి భోజనం అందు బాటులోకి వస్తుంది. 
  • రైళ్లలో వసతులు మెరుగవుతాయి. రైళ్లలో సీట్‌ కవర్లు, దుప్పట్లు, ఫ్యాన్లు, లైటింగ్, ఏసీ, పరిశుభ్రత మెరుగవుతాయి.

కొత్త తరహా రైళ్లు..
ప్రైవేటు వారికి ఇస్తే.. కోచ్‌లు, ఇంజిన్ల రూపురేఖలు మారే అవకాశం ఉంది. కొత్త ఇంజిన్లు, సరికొత్త బోగీలతో దర్శనమిస్తాయి. ఇటీవలే రైల్వే శాఖ భారీ రైళ్ల కోసం అత్యంత శక్తిమంతమైన అమెరికా తయారీ ఇంజిన్లకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇందులో 15 వరకు మన దేశానికి చేరుకున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లోని కాపుర్తలా కోచ్‌ ఫ్యాక్టరీ, తమిళనాడు పెరంబూర్‌లోని ఇంటిగ్రల్‌ కోచ్‌ఫ్యాక్టరీ, రాయ్‌బరేలీలోని మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో రైల్వే కోచ్‌లు తయారవుతున్నాయి. ఇవి కాకుండా బెంగళూరు, బేలాల్లో చక్రాలు, యాక్సల్‌ తయారీ యూనిట్లు ఉన్నాయి. ఇవన్నీ రైల్వే శాఖ సొంత ఫ్యాక్టరీలు. రైళ్లు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తే.. అవి సొంతంగా కోచ్‌ల తయారీ యూనిట్లు ప్రారంభించే అవకాశముంది. తేజస్‌ రైళ్లను సొంతం చేసుకున్న ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ దిశగా అడుగులేస్తోంది. రైల్వే అనుబంధ సంస్థ అయినా.. స్టాక్‌ ఎక్సే్ఛంజి లిస్టింగ్‌కు వెళ్లింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top