చరిత్రాత్మకం.. రైతుబీమా పథకం

Rythu Bheema cheques Distribution - Sakshi

రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది మేమే

గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయి

రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటటౌన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తీసుకువచ్చిన రైతుబంధు, జీవిత భీమా పథకం చరిత్రాత్మకమైనదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జీవితబీమా పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో తమ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ముందుంటుందని, ఇంత వరకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను రైతుల కోసం ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఎంతో మంది సరైన ఆహారం లేక, ప్రమాదాల బారిన పడి, అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీని వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గుర్తించి వారిని ఆదుకోవడానికి రైతుబీమా పేరిట రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు.

ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది తమ ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకోకపోగా అన్యాయం చేశాయని అన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నామని జిల్లాలో 20 మంది రైతులు చనిపోగా అందులో 18 మందికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, వారి ఆత్మకుశాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, డీఏవో శ్రావణ్, నంగునూరు ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏవోలు పరశురాంరెడ్డి, గీత, అఫ్రోజ్‌ పాల్గొన్నారు.  

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నంగునూరు(సిద్దిపేట): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నంగునూరు, బద్దిపడగ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలుకగా మహిళలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నంగునూరులోని ఎస్సీ కాలనీ, ఐకేపీ భవనంలో గ్రామస్తులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. 

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 

మండల కేంద్రం నంగునూరులో రూ. 10 లక్షలతో వైశ్య కమ్యూనిటీహాల్, రూ. 5 లక్షలతో పూసల కమ్యూనిటీహాల్, నంగునూరు నుంచి అంక్షాపూర్‌ వరకు రూ. 75 లక్షలతో నిర్మించనున్న తారు రోడ్డు, ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపనలు చేశారు.  

సిద్దిపేటటౌన్‌ :  దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉపాధ్యా భవన్‌లో ఆదివారం రాత్రి సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని 107 మందికి రూ. 96,12,412 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

అలాగే జీవో నంబర్‌ 59 కింద 75 మంది అర్హులైన వారికి భూమి ధృవీకరణ హక్కు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదని వివరించారు. కార్యక్రమంలో పరమేశ్వర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top