కౌడిపల్లి(నర్సాపూర్): కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు గిరిపుత్రుడు హలావత్ నవీన్కుమార్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. అయినా సంతృప్తి చెందక తన లక్ష్యం ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ కావాలని ఉందని చెప్పారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ తండాకు చెందిన హలావత్ బోజ్యనాయక్, శోభా రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. బోజ్యనాయక్ పోస్ట్మన్గా ఉద్యో గం చేస్తుండగా శోభారాణి వ్యవసాయ కూలీపనులు చేస్తున్నారు.
నవీన్కుమార్ తునికి ఎంజేపీలో ఇంటర్ పూర్తిచేసి నిజాంకాలేజీలో డిగ్రీ, ఓయూలో అర్థశాస్త్రం పీజీ పూర్తి చేశారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఆరు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో కెనరా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎస్బీఐ జూనియర్ అసోసియేట్, కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్, ది న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఏఓ, ఎల్ఐసీ ఏఏఓగా ఇలా ఆరు ఉద్యోగాలు సాధించారు. గత ఏప్రిల్లో ఎస్బీఐలో చేరగా.. వారం రోజుల క్రితం ఎల్ఐసీలో ఏఏఓ ఉద్యోగం రావడంతో అందులో చేరనున్నట్లు చెప్పారు. ఇష్టంతో కష్టపడి ఉద్యోగాలు సాధించానని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉందని చెప్పారు.


