ఎన్‌సీఎల్‌టీ సభ్యుడిగా రాతకొండ మురళి  | Sakshi
Sakshi News home page

ఎన్‌సీఎల్‌టీ సభ్యుడిగా రాతకొండ మురళి 

Published Fri, Apr 20 2018 1:50 AM

Rathakonda Murali As NCLT Member - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ సభ్యుడిగా రాతకొండ మురళి నియమితులయ్యారు. అంతకుముందు ఆయన ఎన్‌సీఎల్‌టీ, బెంగళూరు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మురళిని హైదరాబాద్‌కు బదిలీ చేసి, ఇక్కడ ఎన్‌సీఎల్‌టీ సభ్యుడిగా ఉన్న విత్తనాల రాజేశ్వరరావును బెంగళూరుకు బదిలీ చేస్తూ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ సభ్యుడిగా మురళి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బిసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజీలో మురళి బీఏ పూర్తి చేశారు. ఆయన తాత, తండ్రి కూడా న్యాయవాదులే. ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందిన మురళి.. చిత్తూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1987లో జ్యుడీషియల్‌ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2015లో కర్నూలు జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేశారు.

Advertisement
Advertisement