బయటపడ్డ రేవంత్‌రెడ్డి అక్రమాలు: క్రిమినల్‌ కేసు | Rajendranagar RDO Submit Report On Revanth Reddy Illegal Lands | Sakshi
Sakshi News home page

విచారణలో బయటపడ్డ రేవంత్‌రెడ్డి భూ అక్రమాలు

Mar 3 2020 3:02 PM | Updated on Mar 3 2020 3:05 PM

Rajendranagar RDO Submit Report On Revanth Reddy Illegal Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తయింది. గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్‌ 127లో రేవంత్‌రెడ్డి, కొండల్‌ రెడ్డిలు అక్రమంగా భూ మ్యుటేషన్‌లు, కబ్జాలకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉన్న10.20 ఎకరాల భూమి ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీనితో పాటు సర్వే నెంబర్‌ 127లనే 5.5 ఎకరాలకు టైటిల్‌ లేనట్టు గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌  ఆర్డీవో చంద్రకళ పూర్తి నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంగళవారం సమర్పించారు. ఆర్డీవో నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్‌ చేయించుకునట్లు నివేదికలో పేర్కొన్నారు. (రేవంత్‌ భూ ఆక్రమణ నిజమే)

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఓల్టా చట్టన్ని ఉల్లంఘించినందుకు రేవంత్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో నివేదికలో కోరారు. అలాగే నింబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన గోడలను సైతం కూల్చివేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గండిపేట సమీపంలో అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ.. దానిని ముట్టడించేందుకు సోమవారం ఆయన అనుచరులతో కలిసి అక్కడి చేరకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు, రేవంత్‌కు పెద్దఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులను రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ల అక్రమ భూముల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (రేవంత్‌ నేరాల పుట్ట బయటపడింది)

స్థానికుల ఆరోపణల ఆధారంగా..
గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్‌రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్‌ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌.. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యుటేషన్‌ జరిగిందని నిర్ధారించి సీఎస్‌కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement