సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం అమలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసినపుడు తెగిపోకుండా ఉండేందుకు నిషేధిత సింథటిక్, నైలాన్ మాంజాలను ఉపయోగించకుండా కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పర్యాటక, సాంస్కృతికశాఖ డైరెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నైలాన్, సింథటిక్ మాంజా తయారీ, అమ్మకం, నిల్వ చేయడం, కొనడం, ఉపయోగించడాన్ని 2016 డిసెంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 17న జారీచేసిన ఉత్తర్వులను తప్పకుండా పాటించాలని సూచించింది. ఇనుప, గాజు రజను వంటివి లేకుండా తయారు చేసిన దారాన్ని ఉపయోగించేలా చూడాలని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఐదేళ్ల వరకు జైలుశిక్ష,లక్ష రుపాయల వరకు జరిమానా లేదా రెండింటిని విధించవచ్చని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.
సంబంధిత వార్తలు