ఆ రూటూ.. ఈ రూటూ.. కుదిపేట్టు!

Potholes in Hyderabad Roads - Sakshi

పట్నంలో బండి నడుపుడు గండమే

ఛిద్రమైన నగర రహదారులు

అడుగుకో గుంతతో అవస్థలు    

గంటలకొద్దీ ప్రయాణ నరకం   

మేడిపల్లి కమాన్‌ నుంచి సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వరకు 14.1 కి.మీ మార్గంలో 48 గుంతలు...ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి సీతాఫల్‌మండి, లిబర్టీ, రాణిగంజ్‌ మీదుగా సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వరకు 18 కి.మీ మార్గంలో 60కి పైగా గుంతలు...  నగరంలోని రహదారుల దుస్థితిని చెప్పేందుకు ఈ రెండు ఉదాహరణలు చాలవూ?  వర్షం వచ్చిందంటే గ్రేటర్‌లో ప్రయాణం నరకంగా మారుతోంది. అడుగుకో గుంత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలకు రహదారులు ఛిద్రమై ఏ దారైనా కుదిపేస్తోంది. ఫలితంగావాహనదారుల ఒళ్లు హూనమవుతోంది.అంతేకాకుండా గంటలో చేరుకోవాల్సిన గమ్యానికి రెండు గంటలు పడుతోంది. అసలే మరమ్మతులకు నోచుకోని రోడ్లు... ఇక ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఆయా మార్గాల్లో ప్రయాణ పరిస్థితిపై ‘సాక్షి’ సోమవారం విజిట్‌ నిర్వహించగా... రహదారుల దుస్థితి కళ్లకు కట్టింది.  – సాక్షి, నెట్‌వర్క్‌  

బస్సు నడపాలంటేనే భయమేస్తోంది..
నగరంలో రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో బస్సు నడపడం ఇబ్బందిగా మారుతోంది.గోతులలో నుంచి వెళుతుండడంతో బస్సు కుదుపులకు గురవుతోంది. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గోతుల కారణంగా తరచూ గేర్లు మార్చుతుండడంతో మైలేజీ కూడా పడిపోతోంది.– షౌకత్‌ అలీ, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు 
వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం. మళ్లీ వర్షం రాకపోతే నేటికి గుంతల పూడ్చివేత పూర్తవుతుంది. దెబ్బతిన్న స్ట్రెచ్‌ల పునరుద్ధరణ పనులు బుధవారం ప్రారంభిస్తాం. మెట్రో రైలు కారిడార్‌ మార్గంలో రూ.5 కోట్లతో హెచ్‌ఎంఆర్‌ రహదారుల పునరుద్ధరణ చేపడుతోంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ విభాగాల అధికారులతో కలిసి సోమవారం గాంధీ ఆస్పత్రి నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు మరమ్మతు పనులను పరిశీలించాను.  – మేయర్‌ బొంతు రామ్మోహన్‌

మన్సూరాబాద్‌: పనామా చౌరస్తా నుంచి ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌ వరకు సుమారు 12 కి.మీ దూరం. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు గుంతలమయంగా మారింది.  
గుంతలు ఇలా..
చింతలకుంట చెక్‌పోస్టు వద్ద..  
ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో..  
మలక్‌పేట్‌ ఎస్‌ఎస్‌ గార్డెన్స్‌ వద్ద..  
ఇమ్లీబన్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో..  
చాదర్‌ఘాట్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద..   

నరక యాతన..
రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా గోతులు ఉండటంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. వర్షాకాలం ముందస్తు చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారు. గోతులను పూడ్చటంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.   – బి.కుమార్‌యాదవ్,టాటా ఏసీఈ గూడ్స్‌ ఆటో డ్రైవర్‌మేడిపల్లి – సికింద్రాబాద్‌

ఉప్పల్‌: మేడిపల్లి కమాన్‌ నుంచి సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ వరకు దాదాపు 48 చోట్ల గుంతలు ఉన్నాయి. ప్రధానంగా ఉప్పల్‌ రహదారిలోని వరంగల్‌ జాతీయ రహదారిపై ప్రమాదకర గుంతలు కనిపించాయి. మేడిపల్లి నుంచి సికింద్రాబాద్‌ వరకు 14.1 కి.మీ. దూరం వెళ్లడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. కానీ ప్రస్తుతం గుంతల కారణంగా 1.10 గంటల సమయం పడుతోంది.  

గుంతలు ఇలా..
ఉప్పల్‌ డిపో ఎదురుగా  
ఫిర్జాదీగూడ కమాన్‌ మూలమలుపు వద్ద
ఉప్పల్‌ ఆదిత్య ఆస్పత్రి ఎదుట
ఉప్పల్‌ కమాన్‌ బస్టాండ్‌ వద్ద
ఉప్పల్‌ ప్రధాన రహదారిపై
ఉప్పల్‌ విద్యుత్‌ జంక్షన్‌ వద్ద
మెట్టుగూడ పెట్రోల్‌ బంక్‌ వద్ద
రైల్‌ నిలయం
సికింద్రాబాద్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వద్ద లోతుకుంట – క్లాక్‌టవర్‌

అల్వాల్‌: లోతుకుంట లాల్‌బజార్‌ మధ్యలో రాజీవ్‌ రహదారి మిలిటరీ రోడ్డు కొన్ని చోట్ల ఛిద్రమైంది. రోడ్డుపై కంకరతేలి గుంతలు ఏర్పడ్డాయి.  

గుంతలు ఇలా..
లాల్‌బజార్‌ చౌరస్తా వద్ద రహదారి ఛిద్రం..   
తిరుమలగిరి సిగ్నల్‌ వద్ద ట్రాఫిక్‌జాం   
కార్ఖానా మలుపువద్ద మ్యాన్‌హోల్‌ కవర్‌ పాడైంది  
జూబ్లీ బస్టాండ్‌ చౌరస్తా వద్ద కొట్టుకుపోయిన తారు   

కొంపల్లి – ప్యారడైజ్‌
కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధి కొంపల్లి నుంచి ప్యారడైజ్‌ వరకు, బేగంపేట నుంచి బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా మీదుగా జీడిమెట్ల బస్‌ డిపో వరకు పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయి.  
గుంతలు ఇలా..
కొంపల్లి బిగ్‌ బజారు ఎదురుగా రోడ్డు పక్కన  
బేగంపేట ఓల్డ్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలోని బాలంరాయ్‌ చౌరస్తా వద్ద..  
బాలానగర్‌ నుంచి ఫిరోజ్‌గూడకు వెళ్లేదారిలోని హోండా షోరూమ్, ముత్తూత్‌ ఫైనాన్స్, బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ల సమీపంలో..  
జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా..  

చాంద్రాయణగుట్ట – సీబీఎస్‌
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట–సీబీఎస్‌ రూట్‌లో రహదారి గోతులమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్‌ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, ఖిల్వత్, చౌమహల్లా ప్యాలెస్, మూసాబౌలి, సిటీ కాలేజీ, హైకోర్టు రోడ్డు, అఫ్జల్‌గంజ్‌ల మీదుగా సీబీఎస్‌ వరకు పలు ప్రాంతాల్లో గుంతలు
ఏర్పడ్డాయి. 

గుంతలు ఇలా..
ఫ్లై ఓవర్‌ సిగ్నల్‌ వద్ద ఏకంగా ఎనిమిది గుంతలు
ఫ్లై ఓవర్‌ దిగువన సులబ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో..  
లాల్‌దర్వాజా మోడ్‌ వద్ద..  
సిటీ కాలేజీ వద్ద భారీ ఉన్న గుంత ఏర్పడింది  

క్లాక్‌టవర్‌ – పంజగుట్ట
రాంగోపాల్‌పేట్‌: సీటీవో చౌరస్తా, సికింద్రాబాద్‌ ఫైర్‌స్టేషన్‌ దాటగానే మెట్రో ఫుట్‌ఓవర్‌ కింద మ్యాన్‌హోల్‌ గుంత ప్రమాదకరంగా ఉంది. ప్రకాశ్‌నగర్‌ ప్లైఓవర్‌ పక్కన, మయూరీ మార్గ్, గ్రీన్‌ల్యాండ్‌ చౌరస్తాలో రోడ్డంతా కంకర తేలింది. సోమాజిగూడ వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద గుంత ప్రమాదకరంగా ఉంది. సర్కిల్‌ దాటిన తర్వాత హైదరాబాద్‌ సెంట్రల్‌ వద్ద మరో గుంత ఉంది.  పంజగుట్ట నుంచి ఎర్రగడ్డ వై జంక్షన్‌ వరకు 8 గుంతలు ఉన్నాయి.

గుంతలు ఇలా..
పంజగుట్ట చౌరాస్తా, బిగ్‌బజార్‌ వద్ద 2 గుంతలు  
రాయలసీమ రుచులు, అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్, భరత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌పై రెండు చోట్ల..  
ఎర్రగడ్డ వై జంక్షన్‌ నుంచి ఖైరతాబాద్‌ చౌరస్తా వరకు 7 గుంతలు.   
ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి నెక్లెస్‌రోడ్‌ మీదుగా రసూల్‌పుర ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు 9 గుంతలు   
పంజగుట్ట నుంచి క్లాక్‌టవర్‌ వరకు 6 గుంతలు  
సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఫ్లై ఓవర్‌ రోడ్డు కంకర తేలి ఉంది 

చందానగర్‌ – హైటెక్‌సిటీ
మాదాపూర్‌/భాగ్యనగర్‌ కాలనీ:  చందానగర్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు రోడ్డుకిరువైపులా సుమారు 70 గుంతలు ఉన్నాయి. వర్షం నీరు ఉండటంతో గుంత ఎంతలోతు ఉందో తెలియక వాహనదారులు ఒక్కసారిగా వాహనాలను స్లో చేస్తున్నారు. దీంతో వెనక నుంచి వచ్చే వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది.  అలాగే నిజాంపేట రోడ్డు చౌరస్తా నుంచి నిజాంపేట గ్రామం వరకు రోడ్డుపై ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల గ్యాస్‌ పైపులైను పనుల కోసం నిజాంపేట రోడ్డులో కొంతమేర రోడ్డును తవ్వారు. దీంతో పనులు పూర్తయినా ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.  

గుంతలు ఇలా..
కొండాపూర్‌ నుంచి శిల్పారామం వరకు గుంతమయం
కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌ సమీపంలో 15 గుంతలు   
కృతుంగ, రేనాల్ట్‌ షో రూమ్‌ ప్రధాన రహదారిపై సుమారు 13 గుంతలు  
శిల్పా ఎన్‌క్లేవ్‌ – కొండాపూర్‌ చౌరస్తా వరకు 8..  
కిమ్స్‌ అస్పత్రి నుంచి ఖానామెట్‌కు వెళ్లే రోడ్డుపై 4..  
మాదాపూర్‌లోని సీఐఐ చౌరస్తా రోడ్డుపై దాదాపు 20..  
అక్కడక్కడ చిన్నపాటి గుంతలు 10 వరకు ఉన్నాయి  
కొలన్‌ రాఘవరెడ్డి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది   

గుంతలతో ఎన్ని తిప్పలో..
ఎన్ని ఫ్లైఓవర్లు వేసినప్పటికీ కార్యాలయాలకు సమయానికి చేరుకోలేకపోతున్నాం. కొద్దిపాటి వర్షం పడిందంటే ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారుతోంది. దీనికితోడు రోడ్లు గుంతలమయంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరమ్మతులు చేసినా అవి వెంటనే పాడైపోతున్నాయి. అధికారులు ముందు జాగ్రత్తతో నాణ్యమైన రోడ్లను వేస్తూ ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి.
– కామేశ్వరరావు, ఐటీ ఉద్యోగి

ఓయూ – క్లాక్‌టవర్‌
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి సీతాఫల్‌మండి, చిలకలగూడ, గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు, ఇందిరా పార్కు, లిబర్టీ, ట్యాంక్‌ బండ్, రాణిగంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ వరకు సుమారు 18 కి.మీ దూరం. వాహనాల రద్దీతో  ప్రయాణ సమయం గంట 1– 45 గంటల సమయం పట్టింది. రానూపోనూ 36 కి.మీ పరిధిలో సుమారు 60కి పైగా  గుంతలు ఉన్నాయి. చిలకలగూడ చౌరస్తాలో,  ముషీరాబాద్‌ నుంచి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు మధ్యలో గుంతలతో ప్రయాణం ఆలస్యంగా సాగుతోంది.  

గుంతలు ఇలా..
చిలకలగూడ చౌరస్తా, ముషీరాబాద్‌నుంచి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు వరకు  
సీతాఫల్‌మండి ప్లైఓవర్‌ ప్రవేశం వద్ద..  
చిలకలగూడ రైల్వే కార్టర్స్‌ సమీపంలో..  
చిలకలగూడ చౌరస్తాలో..   
ముషీరాబాద్‌కు వెళ్లే మార్గంలో ఫెంతికోస్తల్‌ చర్చి వద్ద..
ముషీరాబాద్‌ చౌరస్తాలోని ఆర్టీసీ బస్సు స్టాప్‌ వద్ద..
ముషీరాబాద్‌లోని స్పెన్సర్స్‌ సమీపంలో.  
ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు మెట్రో స్టేషన్‌ సమీపంలో, బస్సుస్టాప్‌ వద్ద..  
ట్యాంక్‌బండ్‌పై ఛిద్రమైన రోడ్డు..  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top