శుభలేఖలు పంచేందుకు వెళ్తూ.. | painter killed in road mishap at shankarpally | Sakshi
Sakshi News home page

శుభలేఖలు పంచేందుకు వెళ్తూ..

May 26 2014 11:26 PM | Updated on Aug 30 2018 3:58 PM

చెల్లెలి వివాహ శుభలేఖలు పంచేందుకు వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

శంకర్‌పల్లి: చెల్లెలి వివాహ శుభలేఖలు పంచేందుకు వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. పెళ్లింట విషాదం నెలకొన్న ఈ ఘటన సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిమండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాజ్‌పేట్ అనుబంధ గోపులారం గ్రామానికి చెందిన మధు(26) పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. ఇతడి చెల్లెలు పెళ్లి వచ్చే నెల 4 ఉంది. వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో మధు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో బంధువులకు శుభలేఖలు ఇచ్చేందుకు స్నేహితుడు రాముతో కలిసి బైక్‌పై పటాన్‌చె రు వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో బీడీఎల్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను వీరి వాహనం ఢీకొంది. ప్రమాదంలో మధు రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రగాయాలై రక్తస్రావమవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్ వెనకాల కూర్చున్న రాము కూడ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో రెండు బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. రాము పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

మధు మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మయ్య, సబిత, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన అతడి మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకున్నారు. మృతుడికి ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నాడు. త్వరలో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుందని స్థానికులు తెలిపారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement