101 దుకాణాలు = ఒక్కరే | nly one of 101 stores | Sakshi
Sakshi News home page

101 దుకాణాలు = ఒక్కరే

Jun 24 2014 3:45 AM | Updated on Jul 11 2019 8:44 PM

‘తాగురా భాయ్..తాగి ఊగరా భాయ్’ అన్నట్లు హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల పరిధిలో 482 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ఎట్టకేలకు సోమవారం ముగిసింది.

  •     ఇన్ని దుకాణాలు ఒక్కరే దక్కించుకున్న వైనం
  •      ముగిసిన మద్యం దుకాణాల లాటరీ
  •      బండ్లగూడ, వనస్థలిపురం, మలక్‌పేట, రియాసత్‌నగర్‌లోని దుకాణాలకు ‘ఫుల్లు’ దరఖాస్తులు
  • సాక్షి,సిటీబ్యూరో: ‘తాగురా భాయ్..తాగి ఊగరా భాయ్’ అన్నట్లు హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల పరిధిలో 482 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ఎట్టకేలకు సోమవారం  ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్ జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవయ్య సమక్షంలో లాటరీ నిర్వహించారు.

    హైదరాబాద్,సికింద్రాబాద్,ధూల్‌పేట ఎక్సైజ్‌డివిజన్ల పరిధిలో 212 దుకాణాలుండగా..కేవలం 147 మద్యం దుకాణాలకు మాత్రమే 312 దరఖాస్తులొచ్చాయి. మిగతా 65 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో 312 దరఖాస్తులకే డ్రా తీయగా.. 147 మద్యం దుకాణాలను వ్యాపారులు దక్కించుకున్నారు. కాగా ఇందులో 101 దుకాణాలకు ఒకేఒక్కరు మాత్రమే(సింగిల్ టెండర్) దరఖాస్తు చేసుకోవడంతో ఎలాంటి పోటీ లేకుండానే లెసైన్సు సొంతం చేసుకున్నారు.

    మిగతా 46 దుకాణాలకు ఒకటికి మించి దరఖాస్తులొచ్చినట్లు నగర ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఫారూఖీ తెలిపారు. అత్యధికంగా రియాసత్‌నగర్,మలక్‌పేట్ పరిధిలోని మద్యం దుకాణాలకు14 చొప్పున దరఖాస్తులుందాయన్నారు. కాగా నగరంలో ఒక్కో మద్యం దుకాణానికి లెసైన్సు ఫీజు రూ.90 లక్షలు నిర్ణయించిన విషయం విదితమే. ఈ మొత్తాన్ని నాలుగు త్రైమాసిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన దుకాణాలకు త్వరలో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆబ్కారీశాఖ వర్గాలు తెలిపాయి.
     
    రంగారెడ్డి జిల్లాలో: జిల్లాలో మొత్తం 390 మద్యం దుకాణాలుండగా..335 దుకాణాలకు ఏకంగా 3368 మంది దరఖాస్తు చేసుకున్నారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో నిర్వహించిన లాటరీలో 335 మందికి దుకాణాలు కేటాయించారు. అత్యధికంగా బండ్లగూడలోని ఓ మద్యం దుకాణానికి 56 మంది దరఖాస్తు చేసుకోగా..ఆ తర్వాత వనస్థలిపురంలోని ఓ దుకాణానికి 49 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా మరో 55 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చే సుకోలేదని అధికారులు పేర్కొన్నారు.  
     
    120 మద్యం దుకాణాలకు టెండర్లు నిల్: హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 120 మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఈ దుకాణాలకు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు గడువునిచ్చే అంశాన్ని ఎక్సైజ్ కమిషనర్ పరిశీలిస్తున్నారని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని అవి చెప్పాయి.
     
    సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి: రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం ఎదుట పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల ప్రక్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధ మాట్లాడుతూ మద్యాన్ని ఆదాయ వనరుగా చూడవద్దని, బెల్టుదుకాణాలను ఎత్తివేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కేసీఆర్ ఆ హామీకి కట్టుబడి ఉండాలని కోరారు. ధర్నా నేపథ్యంలో కాసేపు గందరగోళం నెలకొంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement