అవినీతిలో 'సూపర్‌'టెండెంట్‌ | Nizamabad Excise Superintendent arrested | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అరెస్టు

Sep 27 2017 1:52 AM | Updated on Aug 17 2018 12:56 PM

Nizamabad Excise Superintendent arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నిజామాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జ్యోతికిరణ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం నిజామాబాద్‌ సుభాష్‌నగర్‌లోని ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జ్యోతికిరణ్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తరలించారు. హైదరాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన జ్యోతికిరణ్‌ రెండు నెలల క్రితమే నిజామాబాద్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు.

హైదరాబాద్‌లో పనిచేస్తుండగా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడటంతో ఏసీబీ అధికారులు ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. ఈ మేరకు న్యాయస్థానం నుంచి సెర్చ్‌ వారెంట్‌ తీసుకున్న ఏసీబీ అధికారులు నిజామాబాద్‌తో పాటు, హైదరాబాద్‌ బాగ్‌ అంబర్‌పేటలో ఆయన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అలాగే ఆయన సన్నిహితులైన ముగ్గురు వ్యక్తుల ఇళ్లల్లోనూ, నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి.

మార్కెట్‌ విలువ రూ.4 కోట్లకుపైనే..
జ్యోతికిరణ్‌ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేసి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, నగలు, ఇతరత్రా వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు తెలిపారు. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.1.30 కోట్లు కాగా, మార్కెట్‌ విలువ ప్రకారం రూ.4 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ డీజీ తెలిపారు. దాడుల తర్వాత జ్యోతికిరణ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.

ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ..
► జహీరాబాద్‌లోని న్యాకల్‌ మండలంలో రూ.18.7 లక్షల విలువైన 30 ఎకరాల వ్యవసాయ భూమి. ∙హైదరాబాద్‌ బాగ్‌ అంబర్‌పేట్‌లో రూ.30.60 లక్షల విలువైన ఇళ్లు. ∙నల్లకుంటలోని సింగ్మేకర్‌ అపార్ట్‌మెంట్‌ రూ.14 లక్షల విలువైన ఫ్లాట్‌
► ఘట్‌కేసర్‌లో రూ.2.14 లక్షల విలువైన రెండు ప్లాట్లు ∙హయత్‌నగర్‌ తుర్కయాంజల్‌లో రూ.1.60 లక్షల విలువైన ఒక ప్లాట్‌. ∙బీబీనగర్, పోచంపల్లి దేశ్‌ముఖ్‌లో రూ.13.30 లక్షల విలువైన 11 ఓపెన్‌ ప్లాట్లు. ► భూదాన్‌ పోచంపల్లిలోని దుర్గా ఎస్టేట్‌లో రూ.1.20 లక్షల విలువైన రెండు ప్లాట్లు ∙రూ.13.91 లక్షల విలువ గల బంగారు అభరణాలు..
► బ్యాంక్‌ ఖాతాలో రూ.10.13 లక్షల నగదు
► రూ.9.65 లక్షల విలువైన ఇన్సూరెన్స్‌ పాలసీలు
► రూ.8.41 లక్షల విలువ గల మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ కారు.
► రూ.1.20 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు
► రూ.5 లక్షల విలువున్న పురాతనమైన అలంకార వస్తువులు

Advertisement
 
Advertisement
Advertisement