కూరగాయలతో లాభాల బాట


బాల్కొండ: మండలంలోని పలువురు రైతులు వాతావరణానికి అనుకూలంగా పంటమార్పు చేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని బుస్సాపూర్ గ్రామ రైతులు పంట మార్పిడి చేసి కూరగాయలకు సాగు చేయుటకు ఆసక్తి చూపుతున్నారు.



ప్రధాన పంటలైన మొక్క జొన్న, సోయా, జొన్న, సజ్జ , పసుపు పంటలను అధిక మొత్తంలో సాగు చేయడం వల్ల డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు కూరగాయల వైపు మళ్లుతున్నారు. గేదే నిత్యం పాలిచ్చినట్లు కూరగాయల వలన రైతులకు నిత్యం డబ్బులు వస్తున్నాయని రైతులు అంటున్నారు.



 అందకే ఎకరాల్లో వంకాయ, టమాట, కొతిమీర, పువ్వుగోబీ, గోబీగడ్డ , బెండకాయ, బీరకాయలను అధిక ంగా సాగు చేస్తున్నారు. అన్నివేళల పనికి వచ్చే మిరప సాగును కూడా పెంచారు, ఇలా పలు రకాల కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఆలుగడ్డను కూడా సాగు చేస్తున్నారు. పంట మార్పిడితోనే దిగుబడి పెరుగుతుందని అధికారులు సూచించడంతో రైతులు కూరగాయల సాగుబాట పట్టారు. బుస్సాపూర్‌లో ఓరైతు అరఎకరంలో గోబీ, అందులోనే అంతర్ పంటగా కొతిమీర సాగు చేశాడు.  ఇలా రైతులు రకరకాల ప్రయోగాలను చేస్తు  ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు పొందుతున్నారు.



 మార్కెట్‌లు అందుబాటులో లేక..

 కూరగాయల విక్రయాలకు రైతులకు మార్కెట్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  బాల్కొండ మండలంలో  కూరగాయలు సాగు చేసే రైతులు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లేదా ఆర్మూర్ సమీపంలో ఉన్న పెర్కిట్, అంకాపూర్ మార్కెట్లకు తీసుకెళ్లాలి. దీంతో రైతులకు రవాణా భారం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి, స్థానికంగా మార్కెట్లు ఏర్పాటు చేసి, కూరగాయలను సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top