టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం  | MLA Mahesh Reddy Election Campaign In Parigi | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం 

Apr 4 2019 7:34 PM | Updated on Apr 4 2019 7:35 PM

MLA Mahesh Reddy Election Campaign In Parigi - Sakshi

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి  

సాక్షి, పరిగి: టీఆర్‌ఎస్‌ 16 లోక్‌సభ స్థానాలు గెలవటం ఖాయమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పరిగి నియోజకవర్గం గండేడ్‌ మండల పరిధిలోని సంగాయిపల్లి, కంచన్‌పల్లి, వెంకట్‌రెడ్డిపల్లి, చిన్నాయిపల్లి, షేక్‌పల్లి, బొమ్మికుంటతండా, మంగంపేట్, ధర్మాపూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లకుర్మల అవసరాలను గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌ సారథ్యంలోని మా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కేసీఆర్‌ హయాంలో గ్రామీణ వృత్తులకు పెద్దపీట వేశారని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఎంతో సేవ చేసిన మా  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ఓటు అడిగే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ వస్తుందని తెలిపారు. వంచించిన పార్టీలను ప్రజలు నమ్మరని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఇదే టీఆర్‌ఎస్‌ గెలుపుకు బాటలు వేస్తుందని తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించింది కేవలం మా ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement