మిషన్‌ భగీరథ నీళ్లొచ్చాయ్‌..

Mission Bhagiratha FullFilled  Drinking Water In Gadwal - Sakshi

మండలంలోని  అన్ని గ్రామాలకు సరఫరా

ఆనందం వ్యక్తం  చేస్తున్న మహిళలు 

సాక్షి, కేటీదొడ్డి: ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించాలనే సంకల్పంతో చేపట్టిన మిషన్‌ భగీరథ నీళ్లు వచ్చేశాయ్‌.ప్రధాన పైపులైన్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.నల్లా కనెక్షన్ల ద్వారా మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె తదితర గ్రామాల్లో తాగునీరు చేరింది.అలాగే కేటీదొడ్డి మండలంలోని తండాల్లో పనులు పూర్తికావడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు తెలంగాణ రాష్ట్రంలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో తాగునీరు ఇచ్చి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వేసవికాలం వస్తే చాలు ప్రతి సంవత్సరం ప్రజలు గ్రామశివారులోని పొలాల నుంచి తాగునీరు తెచ్చుకునేవారు. మిషన్‌ భగీరథ నీరు రావడంతో నీటికోసం పొలాల్లో బోరుబావులను ఆశ్రయించాల్సిన పనితప్పింది.  

పలు గ్రామాల్లో తాగునీరు
మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గు వ్వలదిన్నె తదితర గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తయి నల్లాల ద్వారా తాగునీరు కూడా వస్తుంది. నూతనంగా గ్రామపంచాయతీలుగా ఏర్పడిన పైజారితాండా, తూర్పుతండా గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనులు అంతా పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లాలు కూడా బిగించారు.

తండాలో గతంలో కిలో మీటర్‌ దూరం నుంచి తాగునీరు తెచ్చుకునే వారు. ఇప్పుడు నల్లా కనెక్షన్ల ద్వారా ఆ సమస్య తీరనుందని గ్రామస్తులు, తండవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గువ్వలదిన్నెలో దాదాపు నల్లా కనెక్షన్‌ పూర్తియ్యాయి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు వేసవికా లంలో కూడా పుష్కలంగా మిషన్‌ భగీరథ నీటిని తాగుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మా గ్రామానికి ఇబ్బంది లేదు
గత సంవత్సరం నుంచి మా గ్రామానికి తాగునీటికి ఎలాంటి సమస్య లేదు. 6 నెలల నుంచి మిషన్‌ బగీరథ ద్వారా తాగునీరు వస్తుంది. దీంతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఎండాకాలంలో కూడా నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. 
– అంజనమ్మ, కొండాపురం
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top