వెనుకబడిన రెడ్లకు చేయూతనివ్వాలి | Minister naini about backward reddy's | Sakshi
Sakshi News home page

వెనుకబడిన రెడ్లకు చేయూతనివ్వాలి

Nov 12 2017 1:33 AM | Updated on Oct 20 2018 5:03 PM

Minister naini about backward reddy's - Sakshi

ఢంకా మోగించి గ్లోబల్‌రెడ్డి కన్వెన్షన్‌ను ప్రారంభిస్తున్న నాయిని. చిత్రంలో రమాకాంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: రెడ్లందరూ ఐక్యంగా ఉండి ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూతనివ్వాలని, రెడ్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సుకు నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చాలామంది రెడ్లు దయనీయ స్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రెడ్డి సామాజిక వర్గంపై ఉందన్నారు. రాజ్‌ బహదూర్‌ వెంకట్‌రాంరెడ్డి వందేళ్ల క్రితమే భవిష్యత్‌ తరాల కోసం రెడ్డి హాస్టల్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

తాజాగా రెడ్డి హాస్టల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 15 ఎకరాల స్థలం ఇచ్చి నిధులు కేటాయించారని తెలిపారు. పిల్లలను బాగా చదివిస్తేనే రెడ్డి సమాజం ఉన్నతమవుతుందన్నారు. గ్లోబల్‌ రెడ్డి కన్వెన్షన్‌ కన్వీనర్, మాజీ చీఫ్‌ సెక్రటరీ పి.రమాకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్లను ఆహ్వానిస్తూ గ్లోబల్‌ రెడ్డి కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో చదువుకు తగిన ఉద్యోగాలు, వృత్తి నైపుణ్యం, ఉచిత న్యాయ సలహాలు, సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇవ్వటం, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించటం, తదితర అంశాలపై చర్చించటం జరుగుతుందన్నారు.  

ప్రభుత్వ మాజీ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ కల్లం మాట్లాడుతూ రెడ్లు పరస్పరం సహకారంతో ఉంటూ అవకాశాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ్యాప్తంగా అనేక మంది రెడ్లు అనైక్యతతో నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ రెడ్డి సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు వసుంధర రెడ్డి, ఎడ్ల రఘుపతి రెడ్డి, నల్ల భాస్కర్‌ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement