ఎట్టకేలకు ఒక్కటయ్యారు | Lovers who are married in the presence of elders | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఒక్కటయ్యారు

Jan 25 2018 7:43 PM | Updated on Jun 4 2019 5:04 PM

Lovers who are married in the presence of elders - Sakshi

పెద్దల సమక్షంలో ఒక్కటైన ప్రేమ జంట

బషీరాబాద్‌(తాండూరు): బషీరాబాద్‌ మండలం మంతట్టి గ్రామానికి చెందిన బోయిని నర్సింహులు కొడుకు శ్రీశైలం (22), ఇదే గ్రామానికి చెందిన తలారి అంజిలప్ప కూతురు జయశ్రీ(చిట్టి) (21) చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. గ్రామం నుంచి నిత్యం తాండూరు వెళ్లి చదువుకునే వారు. వీరి మధ్య ఉన్న స్నేహం, చనువు ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కులాలు ఒక్కటయినప్పటికీ ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులిద్దరూ వారం రోజుల క్రితం ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత రాజుకున్నాయి.

ఇంటినుంచి పారిపోయిన జంట మంగళవారం ఫోన్‌లో గ్రామ పెద్దలను సంప్రదించింది. తాము కలిసి జీవించాలనుకుంటున్నామని ఇందుకు తమ తల్లిదండ్రులను ఒప్పించాలని కోరారు. లేదంటే ఇద్దరం కలిసి తనువు చాలిస్తామని హెచ్చరించారు. ఈ సమస్యకు మార్గం చూపాలనుకున్న గ్రామస్తులు, పెద్దలు ఇరు కుటుంబాలకు సర్ది చెప్పి పెళ్లికి ఒప్పించారు. చివరకు అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు అంగీకారం తెలిపారు. దీంతో ప్రేమజంట బుధవారం నవాంద్గి సంగమేశ్వరాలయం వద్ద ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని స్వామివారి సన్నిధిలో పెళ్లి జరిపించారు. అప్పటివరకూ పగతో రగిలిపోయిన వారి మోములపై చిరునవ్వులు దరహాసం చేశాయి. అనంతరం కొత్తజంటను వరుడి ఇంటికి చేర్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement