
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో తీపి కబురు వినిపించింది. కేంద్ర భూసేకరణ చట్టం–2013 ప్రకారం పునరావాసం, పరిహారం నిబంధనలు అమలు చేశాకే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలంటూ కేంద్ర ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ (ఈఏసీ) కమిటీ గతంలో జారీచేసిన ఆదేశాల్లో మరిన్ని సడలింపులిచ్చింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2017 ప్రకారం భూసేకరణ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ డైరెక్టర్ కెరికెట్టా ఉత్తర్వులు వెలువరించారు.
ఈ నెల 18న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈఏసీ పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగానే పలు షరతులను విధించింది. వాటి ప్రకారం ప్రాజెక్టుకు ముంపు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున.. నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలి. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్మెంట్ చేపట్టాలి. దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలి. ఘన వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలి. ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ విధానంతో రీసైక్లింగ్ చేయాలి. భూసేకరణ చట్టానికి అనుగుణంగా భూమిని కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలి.