తండ్రి వద్దు.. కొడుకు ముద్దు | Koppula Harishwar Reddy Son Mahesh Reddy Got MLA Ticket | Sakshi
Sakshi News home page

తండ్రి వద్దు.. కొడుకు ముద్దు

Sep 7 2018 4:37 PM | Updated on Sep 7 2018 4:37 PM

Koppula Harishwar Reddy Son Mahesh Reddy Got MLA Ticket - Sakshi

కొప్పుల మహేశ్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాజకీయ కురువృద్ధుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డికి ఈసారి టికెట్‌ దక్కలేదు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయనకు టికెట్‌ నిరాకరించిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం.. ఆయన స్థానే కుమారుడు మహేశ్‌రెడ్డికి టికెట్‌ ఖాయం చేసింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో టీడీపీని వీడి జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తొలి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరొందిన ఆయన అనూహ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రత్యర్థి రామ్మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. గెలిస్తే తెలంగాణ తొలి మంత్రివర్గంలో బెర్త్‌ లభిస్తుందని అంతా ఊహించారు. అయితే, ఓటమి చెందడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి.

ఆ తర్వాత సీఎంను కలిసిన ఆయనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ దక్కలేదు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆనారోగ్యం బారిన పడ్డ హరీశ్వర్‌.. నియోజకవర్గ రాజకీయాలకు కొంత దూరం పాటించారు. ఇటీవల పూర్తిసాయిలో కోలుకున్న ఆయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడు మహేశ్‌రెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. స్థానిక సమీకరణలు, హరీశ్వర్‌రెడ్డి రాజకీయ చాణక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన పుత్రుడికి టికెట్‌ను ఖరారు చేస్తూ గులాబీ బాస్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement