మెరుగైన సేవలందిస్తాం | Improved service will provide | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందిస్తాం

Jul 16 2014 3:10 AM | Updated on Aug 15 2018 9:20 PM

మెరుగైన సేవలందిస్తాం - Sakshi

మెరుగైన సేవలందిస్తాం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని.. రోగులకు ఎలాంటి ఇబ్బందీ కలగనివ్వమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య చెప్పారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని.. రోగులకు ఎలాంటి ఇబ్బందీ కలగనివ్వమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య చెప్పారు. మంగళవారం ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించి బాదేపల్లి, బిజినేపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ ఉన్న వసతులను పరిశీలించి రోగులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవిద్య, అనాగరికత, వలసలు, మూఢనమ్మకాల మూలంగానే జిల్లా లో మాతా శిశు మరణాలు, హెచ్‌ఐవీ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు.  
 
 పాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి బాదేపల్లి సీహెచ్‌సీని సందర్శించారు. అక్క డ  ఔట్‌పేషెంట్ విభాగం నిర్వహణ తీరును పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన మిహ ళలతో మాట్లాడుతూ అంగన్‌వాడీల ద్వారా సరఫరా చేస్తు న్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న ఎక్స్‌రే యంత్రాన్ని పరిశీలించి, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో టెక్నీషియన్‌ను నియమించుకోవాలని ఆదేశించారు. రోగులకు భోజనం, మందులు అందుతున్నాయా లేదా అని ఆరా తీసిన డిప్యూటీ సీఎంకు పలు పిర్యాదులు అందాయి. ఆసుపత్రి అభివృద్ధి నిధు ల్లో 10శాతం మందుల కొనుగోలుకు వినియోగించుకునే అవకాశముందన్నారు. బయటి షాపుల నుంచి మందులు సిఫారసు చేసే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిజినేపల్లి ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గదిని పరిశీలించి ఆపరేషన్ చేయించుకున్న మహిళలతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల వారికి వైద్యసేవలు అందించేందుకు 104 ద్వారా మారుమూల ఆరోగ్య ఉపకేంద్రాల్లో కూడా మెరుగైన సేవలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
 
 అనంతరం గుమ్మకొండ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామసభకు డిప్యూటీ సీఎం రాజయ్య హాజరయ్యారు. రాష్ట్ర జనాభా  3.60 కోట్లు కాగా, 84లక్షల కుటుంబాలకు 1.10లక్షల రేషన్ కార్డులు జారీ అయ్యాయన్నారు. లబ్ధిదారుల కంటే నిర్మితమైన గృహాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పన లక్ష్యంగా ‘మన ఊరు- మన ప్రణాళిక’ చేపట్టామన్నారు. రాష్ట్రంలో 85శాతం మేర ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. అనంతరం నాగర్‌కర్నూలు ఏరియా ఆసుపత్రిని డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇన్‌పేషెంట్లు, ఔట్‌పేషెంట్లకు తగినట్లుగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.
 
 పారిశుద్ధ్యం, ప్ర యోగశాల లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ నే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు. వైద్యులకు రక్షణ, ఖాళీగా వున్న పోస్టుల భర్తీ, చికిత్సకు అవసరమైన పరికరాలు సమకూర్చడం వంటి హామీలు ఇచ్చారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. చివరగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని తనిఖీ చేశారు. భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం వెంట కలెక్టర్ గిరిజా శంకర్, డీఎంహెచ్‌ఓతో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement