డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం | Andhra Pradesh ranks 4th in dengue deaths | Sakshi
Sakshi News home page

డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం

Jan 1 2026 4:52 AM | Updated on Jan 1 2026 4:52 AM

Andhra Pradesh ranks 4th in dengue deaths

రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపైనే ధ్యాస

2025 జనవరి నుంచి నవంబరు మధ్య 2,386 కేసులు

గతేడాది రాష్ట్రంలో డెంగీకి ఇద్దరు, మలేరియాకు ముగ్గురు బలి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీతో పేదలకు సకాలంలో వైద్యం

వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ 

సాక్షి, అమరావతి : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉందన్నట్లుగా ఉంది రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం పనితీరు. దోమలపై డ్రోన్‌లతో యుద్ధం అంటూ మాటలు కోటలు దాటించిన కూటమి సర్కారు.. ఆచరణలో మాత్రం అభాసుపాలవుతోంది. కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడంపైనే ధ్యాస పెట్టిన ప్రభుత్వం.. ప్రజారోగ్య రక్షణపై మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా..  డెంగీ, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధుల నియంత్రణలో దారుణంగా విఫలమవుతోంది. 

వ్యాధుల బారినపడి బాధితులు మరణిస్తుంటే విషయం బయటకు పొక్కకుండా చూసుకునే పనిలో పడింది తప్ప వాటి నియంత్రణ చర్యలపై ఏమాత్రం దృష్టిసారించడంలేదు. దీంతో.. డెంగీ మరణాల్లో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ బండారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ బట్టబయలు చేసింది. ఈ వివరాల ప్రకారం.. 2025 జనవరి నుంచి నవంబరు మధ్య ఏపీలో 2,386 కేసులు నమోదు కాగా.. ఐదు మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. 

49 మరణాలతో కేరళ తొలి స్థానంలో, మహారాష్ట్ర (13), తమిళనాడు (12) రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబరు మధ్య దేశవ్యాప్తంగా 1.13 లక్షల పాజిటివ్‌ కేసులు, 94 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రూ.25 వేలు ఖర్చయింది..
రెండు నెలల కిందట వైరల్‌ జ్వరం రావడంతో నగరంలోని ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయించగా డెంగీ అని తేలింది. దీంతో.. వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళ్తే ఉచిత వైద్యం కుదరదన్నారు. గత్యంతరంలేక బిల్లు చెల్లిస్తానని చెప్పి అడ్మిట్‌ అయ్యాను. చివరికి రూ.25 వేల ఖర్చయింది. డబ్బు కోసం బంధువుల దగ్గరఅప్పుచేయాల్సి వచ్చింది.  – అప్పారావు, విజయవాడ

రెండేళ్లుగా మరణాలు..
అయితే, రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. 2023లో రాష్ట్రంలో డెంగీ మరణాలు నమోదు కాలేదు. మలేరియా, జపనీస్‌ ఎన్సెఫాలిటిస్‌ (జేఈ) వైరస్‌ మరణాలు కూడా 2023లో ఒక్కటంటే ఒక్కటీ నమోదుకాలేదు. కానీ, 2025 జనవరి నుంచి సెప్టెంబరు వరకు.. ఈ వ్యాధులతో పలువురు చనిపోయారు.

» అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముగ్గురు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మలేరియా బారినపడి మరణించారు. 
»గతేడాది శ్రీకాకుళం, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
» ఇక డెంగీతో ఈ ఏడాది నవంబరు నాటికి ఐదుగురు మరణించారు. మృతులు కర్నూలు, అన్నమయ్య, బాపట్ల, ఇతర జిల్లాల వారు. 
» గతేడాది కూడా ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు డెంగీ బారినపడి మృత్యువాతపడ్డారు. 
» 2024లో జేఈ వైరస్‌ బారినపడిన ఇద్దరు మరణించారు. 
» ఇదే ఏడాది కలరా బారినపడి ఏడుగురు మరణించారు.

చికిత్సల కోసం అప్పులు..
వ్యాధుల వ్యాప్తి నియంత్రణలోనే కాక, బాధితులకు ఉచిత సేవల కల్పనలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్‌ వంటి పెద్ద జబ్బులతో పాటు సీజనల్‌ వ్యాధుల బారిన పడిన వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలుచేసింది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వైరల్‌ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుదల సమస్య తలెత్తుతోంది. 

ఈ క్రమంలో.. ఎలిసా నిర్ధారణ పరీక్షతో సంబంధంలేకుండా వైరల్‌ జ్వరంతో బాధపడుతూ ర్యాపిడ్‌ కిట్‌లో పాజిటివ్‌ ఉండి, ప్లేట్‌లెట్‌ తగ్గుదల సమస్య ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగీ చికిత్స అందించే విధానాన్ని వైఎస్‌ జగన్‌ హయాంలో అమలుచేశారు. 

అయితే, చంద్రబాబు గద్దెనెక్కాక ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడంతో డెంగీ, మలేరియా తదితర వ్యాధులతో పాటు, గుండె, కిడ్నీ బాధితులకు సైతం ఉచిత వైద్యసేవలు అందడంలేదు. డెంగీ, వైరల్‌ జ్వరాల చికిత్సలకు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తే రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆరోగ్యశ్రీ వర్తించక వైద్యం కోసం అప్పులుచేయాల్సి వస్తోందని పేద, మధ్యతరగతి కుటుంబాల వారు గగ్గోలు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement