లెక్క మారెన్‌!

Hyderabad Voting Percentage Announce Officials - Sakshi

తొలుత తక్కువగా ప్రకటించిన అధికారులు  

శుక్రవారం తుది గణాంకాలు విడుదల  

మొత్తంగా హైదరాబాద్‌లో 44.75శాతం, సికింద్రాబాద్‌లో 46.26 శాతం,

మల్కాజిగిరిలో 49.40 శాతం నమోదు   అయినా గతంతో పోలిస్తే తక్కువే  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో పోలింగ్‌ శాతం లెక్క మారింది. లెక్కింపులో గందరగోళం నెలకొంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలకు గాను తొలుత తక్కువ పోలింగ్‌ శాతం ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత సరిదిద్దారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు గురువారం జరిగిన విషయం విదితమే. ఆ రోజు రాత్రి వరకు అధికారులు అందించిన సమాచారం ప్రకారంహైదరాబాద్‌లో 39.20 శాతం, సికింద్రాబాద్‌లో 44.99 శాతం, మల్కాజిగిరిలో 49.21 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితేఅధికారులు మళ్లీ శుక్రవారం తుది గణాంకాలు విడుదల చేశారు. దీని ప్రకారం హైదరాబాద్‌లో 44.75 శాతం, సికింద్రాబాద్‌లో 46.26 శాతం, మల్కాజిగిరిలో 49.40 శాతంపోలింగ్‌ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్‌ పెరిగినప్పటికీ... గతంతో పోలిస్తే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువే నమోదైంది. సికింద్రాబాద్‌లో 39.20 శాతం పోలింగ్‌ నమోదైందని తొలుత ప్రకటించిన అధికారులు.. గురువారం రాత్రికి దాన్ని 44.99 శాతంగా పేర్కొన్నారు. మళ్లీ శుక్రవారం 46.26 శాతంగా ప్రకటించారు. అదే విధంగా హైదరాబాద్‌ విషయంలోనూ తొలుత 39.49 శాతం పేర్కొనగా.. అంతిమంగా 44.75 శాతంగా తేల్చారు. దీంతో ప్రజలు కొంత అయోమయానికి గురయ్యారు.  

తుది లెక్కల మేరకు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం పెరిగింది. పోలింగ్‌ జరిగిన గురువారం రాత్రి వరకు హైదరాబాద్‌లో 39.49శాతం, సికింద్రాబాద్‌లో 44.99శాతం పోలింగ్‌తో వెరసీ జిల్లాలో 42.24శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే తుది లెక్కల అనంతరం హైదరాబాద్‌లో 44.75శాతం, సికింద్రాబాద్‌లో 46.26శాతం పోలింగ్‌ జరగడంతో జిల్లాలో మొత్తం 45.51శాతం పోలింగ్‌ నమోదైనట్లు పేర్కొన్నారు.  

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 19,57,772 మంది ఓటర్లుండగా... 8,76,078 మంది ఓటు వేశారు. వీరిలో 4,77,929 మంది పురుషులు, 3,98,145 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు.  
సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 19,68,147 మంది ఓటర్లుండగా... 9,10,437 మంది ఓటు వేశారు. వీరిలో 4,85,913 మంది పురుషులు, 4,24,520 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు.  
మల్కాజిగిరిలో మొత్తం ఓటర్లు 31,49,710 మంది ఉండగా... 15,60,108 ఓటు వేశారు. వీరిలో 8,22,098 మంది పురుషులు, 7,37,975 మంది మహిళలు, ఇతరులు 35 మంది ఉన్నారు. 

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో గోషామహల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 53.51శాతం పోలింగ్‌ నమోదు కాగా...అత్యల్పంగా మలక్‌పేట సెగ్మెంట్‌లో37.40 శాతం నమోదైంది. 
సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 52.70 శాతం పోలింగ్‌ నమోదవగా... అత్యల్పంగా నాంపల్లిలో 38.77శాతం పోలింగ్‌ జరిగింది.
మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో మేడ్చల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 56.58 శాతం పోలింగ్‌ నమోదు కాగా... అత్యల్పంగా ఎల్బీనగర్‌లో 44.49 శాతం నమోదైంది.  
హైదరాబాద్‌ జిల్లా పరిధిలో (హైదరాబాద్, సికింద్రాబాద్‌ రెండూ కలిపి) సగటున 45.51 శాతం పోలింగ్‌ నమోదైంది. 
ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు 39,25,919 మంది ఉండగా... 17,86,515 మంది ఓటు వేశారు. వీరిలో 9,63,842 మంది పురుషులు, 8,22,665 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు.  

హైదరాబాద్‌ లోక్‌సభ
మొత్తం ఓటర్లు: 19,57,772
పోలైన ఓట్లు: 8,76,078  
పోలింగ్‌ శాతం: 44.75  

సికింద్రాబాద్‌ లోక్‌సభ
మొత్తం ఓటర్లు: 19,68,147
పోలైన ఓట్లు: 9,10,437  
పోలింగ్‌ శాతం: 46.26

మల్కాజిగిరి లోక్‌సభ 
మొత్తం ఓటర్లు: 31,49,710  
పోలైన ఓట్లు: 15,60,108  
పోలింగ్‌ శాతం: 49.40  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top