ఎంతైనా విద్యుత్‌ సరఫరా చేస్తాం

ఎంతైనా విద్యుత్‌ సరఫరా చేస్తాం - Sakshi


ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పష్టీకరణ

ఈ నెలాఖరులోగా 10 వేల మెగావాట్ల డిమాండ్‌

ఆ మేర సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం ఎంత పెరిగినా నిరంతరాయంగా సరఫరా కొనసా గించేందుకు ఏర్పాట్లు చేశామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ నెల 3న రికార్డు స్థాయిలో 9,003 మెగావాట్ల అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదైందని, 181 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా జరిగింద న్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నెల 6న అధికంగా 2,413 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ నమోదైందన్నారు. వేసవి తీవ్రత, రబీ అవసరాల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా విద్యుత్‌ డిమాండ్‌ 10,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందని, ఆ మేర విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వేసవి, రబీ పంటల అవసరాలకు తగ్గట్లు విద్యుత్‌ సరఫరాపై గురువారం దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్, 1,180 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రస్తుతం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు.



అప్రమత్తంగా ఉండండి

ఫీడర్‌ ట్రిప్పింగ్‌లతో జిల్లాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుండటంపై ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి పేర్కొన్నారు. అంతరా యాలు లేకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగి సాంకేతిక కారణాలతో సరఫరాలో అంతరాయాలు కలగవచ్చని, ఎప్పటి కప్పుడు సరఫరాను పునరుద్ధరించాలని సూచిం చారు. సిబ్బంది అందుబాటులో లేక రైతులే స్వయంగా ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు యత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదాలకు బాధ్యులుగా తేలితే స్థానిక ఏఈ, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. 16 నెలల్లో 54 కొత్త 132/33 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేశామని, ఈ విషయంలో పీజీసీఎల్‌ సీఎండీ స్వయంగా తనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారని, ఇది రాష్ట్ర విద్యుత్‌ శాఖకు గర్వకారణమని చెప్పారు. సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్‌రావు, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాల రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top