పీఎఫ్‌సీలో మెజారిటీ వాటాకు సై  | Government Explores Ways to Keep 51percent Stake in PFC After REC Merger | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌సీలో మెజారిటీ వాటాకు సై 

Apr 17 2026 6:10 AM | Updated on Apr 17 2026 7:48 AM

Government Explores Ways to Keep 51percent Stake in PFC After REC Merger

ఆర్‌ఈసీతో విలీనంపై ప్రభుత్వ యోచన 

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ ఎన్‌బీఎఫ్‌సీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)లో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకునే యోచనలో ఉంది. విద్యుత్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజాలు పీఎఫ్‌సీతోపాటు.. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)లో పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం పీఎఫ్‌సీలో ఆర్‌ఈసీ విలీనాన్ని చేపట్టనుంది. 

అయితే అతిపెద్ద పీఎస్‌యూ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజంగా ఆవిర్భవించనున్న విలీన సంస్థలో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకోవాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు అనుగుణంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రమోటర్‌గా 51 శాతం వాటాను కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వానికి పీఎఫ్‌సీ ప్రిఫరెన్స్‌ షేర్ల జారీసహా.. వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకున్న మరో అవకాశం ప్రభుత్వానికి కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకాగా.. తద్వారా మెజారిటీ వాటాను నిలుపుకోవచ్చని తెలియజేశారు.  

ప్రభుత్వ వాటా ఇలా 
కంపెనీల చట్టం ప్రకారం పీఎస్‌యూగా గుర్తించేందుకు చెల్లించిన మూలధనంలో ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటా ఉండాలి. ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వ వాటా 55.99 శాతంకాగా.. ఆర్‌ఈసీలో 52.63 శాతం వాటా కలిగి ఉంది. రెండు సంస్థలలోనూ మిగిలిన వాటా సాధారణ వాటాదారుల(పబ్లిక్‌) వద్ద ఉంది. 2025 డిసెంబర్‌31కల్లా పీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్‌ లోన్‌ అసెట్‌ బుక్‌ రూ. 11.51 లక్షల కోట్లను తాకగా.. ఆర్‌ఈసీ రూ. 5.82 లక్షల కోట్ల అసెట్‌ బుక్‌ను కలిగి ఉంది. విద్యుత్‌ రంగ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్‌ సౌకర్యాలు కల్పించే పీఎఫ్‌సీ 20 శాతం మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తోంది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్‌ఈసీ ఫైనాన్సింగ్‌ సర్వీసులు అందించే సంగతి తెలిసిందే.  

Advertisement
 
Advertisement
Advertisement