దరఖాస్తును తిరస్కరించినప్పుడు ఆయనకెందుకు చెప్పలేదు?
ప్రభాస్ భూమి విషయంలో అధికారులను ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయ్దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించినప్పుడు, ఆ లిఖితపూర్వక సమాచారాన్ని దరఖాస్తుదారుడైన సినీనటుడు ప్రభాస్కు ఎందుకు తెలియచేయలేదని హైకోర్టు బుధవారం సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాయ్దుర్గ్ పన్మక్త గ్రామంలో తనకున్న భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు ఆ స్థలం ప్రహరీ గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. తిరస్కరణ విషయం ప్రభాస్కు తెలియచేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.