రథయాత్రపై నిర్ణయం చెప్పండి

High Court order to Hyderabad Police For Rath Yatra - Sakshi

 హైదరాబాద్‌ పోలీసులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఈనెల 31న హైదరాబాద్‌లో తలపెట్టిన శ్రీరామ రథయాత్రకు అనుమతినిచ్చే విషయంలో తగిన నిర్ణయం తెలుపాలని హైకోర్టు గురువారం హైదరాబాద్‌ సిటీ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రథయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వీహెచ్‌పీ తెలంగాణ కార్యదర్శి ఎం.గాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

అయితే అనుమతినివ్వాలని పోలీసులను ఆదేశించేందుకు నిరాకరిస్తూ సింగిల్‌జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై గాల్‌రెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, శ్రీరామ రథయాత్రకు అనుమతి కోరుతూ తాజాగా దరఖాస్తు చేసుకుంటామని, అనుమతినిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top