బీసీ గురుకులాలకు భారీ డిమాండ్‌

Heavy demands to the BC Gurukuls - Sakshi

     జూనియర్‌ కాలేజీల్లో తొమ్మిది పాయింట్లు వచ్చిన విద్యార్థులకే సీట్లు

     తొలిదశ కౌన్సెలింగ్‌లో 92 శాతం సీట్లు భర్తీ  

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాలలకు డిమాండ్‌ పెరిగింది. బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీలు, పాఠశాలలు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలతో క్షేత్రస్థాయిలో ప్రవేశాలకోసం పోటీ తీవ్రమైంది. ఇటీవల బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. తాజా ప్రవేశాల్లో పదోవంతు సీట్లు అత్యంత ప్రతిభావంతులే దక్కించుకోవడం గమ నార్హం. రాష్ట్రంలో 19 బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 3,040 సీట్లుండగా, 24,327 మంది దరఖాస్తు చేసుకున్నారు.

తాజాగా సీట్ల కేటాయింపు పూర్తయింది. వీరిలో ఏకంగా 10 శాతం విద్యార్థులు 9జీపీఏ కంటే ఎక్కువ మార్కులు సాధించినవారే ఉండటం గమనార్హం. మిగతా 40శాతం సీట్లు 8.5 నుంచి 9జీపీఏ లోపు మార్కులు సాధించినవారు న్నారు. సాధారణంగా 9జీపీఏ కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు స్థానిక జూనియర్‌ కాలేజీలు ఉచిత విద్య లేదా ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటి అవకాశాలను వదులుకుని బీసీ గురుకులాల్లో సీట్ల కోసం పోటీపడటం విశేషం. 2017–18 సంవత్సరంలో బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 98శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎస్సీ, ఎస్టీ, గురుకులాల కంటే బీసీ గురుకులాలు అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశాయి. 

తొలివిడతలో 92శాతం భర్తీ
రాష్ట్రంలో 142 బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో ఐదోతరగతికి సంబంధించి 11,360 సీట్లు భర్తీ చేసేందుకు బీసీ గురుకుల సొసైటీ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు  45 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా సీట్ల కేటా యింపు కౌన్సెలింగ్‌ తొలివిడత పూర్తయింది. ఇందు లో 10,382 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 938 సీట్లను రెండోవిడతలో భర్తీ చేసేందుకు బీసీ గురు కుల పాఠశాలల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి సీట్ల భర్తీలో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు కత్తెర వేసింది.

గతేడాది కొత్తగా 119 గురుకుల పాఠ శాలలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించగా, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలు తీసుకొచ్చిన వారికి అడ్మిషన్లలో ప్రాధా న్యత ఇచ్చారు. తాజాగా ప్రవేశాలకు విపరీతమైన పోటీ ఏర్పడింది. అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్‌ ఆధా రంగా సీట్లు భర్తీ చేసినట్లు గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ‘సాక్షి’తో చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top