అధికారులు, గ్లోబరీనాను కాపాడేందుకే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళం నేపథ్యంలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. బోర్డు అధికారులు, గ్లోబరీనాను కాపాడటానికే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ఇతర రాష్ట్రాల పర్యటనలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సందర్శించి.. విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం, అధికార పార్టీలోని ఒక్క ప్రజాప్రతినిధి అయినా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారా అని ప్రశ్నించారు. ఉచితంగా రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ పేరుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.