కూల్‌డ్రింక్‌ అనుకుని..పురుగు మందు తాగింది

Girl Drank Fertiside  - Sakshi

పాల్వంచ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల చేయించుకునేందుకు తన రెండేళ్ళ కూతురుని తీసుకుని తల్లి వెళ్లింది. అక్కడ ఓ కూల్‌ డ్రింక్‌ సీసాను చూసిన ఆ చిన్నారి, దానిని చేతిలోకి తీసుకుని అందులోని ద్రవాన్ని తాగింది. అందులో ఉన్నది కూల్‌డ్రింక్‌ కాదు... పురుగు మందు. ఆ తల్లి తెలిపిన వివరాలు.. శుక్రవారం పట్టణంలోని శేఖరం బంజరకు చెందిన బోడ వెంకటేష్‌ భార్య పద్మ. ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలను చేయించుకునేందుకు రెండేళ్ల కూతురు సహస్త్రను తీసుకెళ్లింది. అక్కడ పెద్ద క్యూ ఉండటంతో నిరీక్షిస్తోంది. ఆమె ఒళ్లో నుంచి ఆ చిన్నారి కిందకు దిగి ఆడుకుంటోంది. పాఠశాల గదిలో ఓ మూలకు కూల్‌ డ్రింక్‌ సీసా కనిపించింది.

దానిని తీసుకుని, అందులోని ద్రవాన్ని తాగింది. కొద్దిసేపటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడంతో తల్లి కంగారు పడింది. బాటిల్‌లోని డ్రింక్‌ తాగిందని ఓ పాప చెప్పింది. అది పురుగు మందుగా గుర్తించిన ఆ తల్లి, వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపపత్రికి తన బిడ్డను తీసుకెళ్లింది. ఆ చిన్నారి కడుపు నుంచి మందును వైద్యులు కక్కించారు. ఆ మందును ఎండ్రోసల్పాన్‌గా గుర్తించారు. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వచ్చింది..? సీసాలో పెట్టి ఉంచినా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వెంకటేష్, పద్మ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రవి విచారణ చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top