నెల రోజుల ముందుగానే భానుడు భగభగ మంటున్నాడు.
మండుతున్న ఎండలు
36 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రత
హడలిపోతున్న జనం
పోచమ్మమైదాన్ : నెల రోజుల ముందుగానే భానుడు భగభగ మంటున్నాడు. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు కొంత చల్లగా ఉంటోంది. ఆ వెంటనే సూర్య భగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధవారం పగటి ఉష్ణోగ్రత 36 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రత 29 సెల్సియస్ డిగ్రీలు మాత్ర మే ఉంది. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది.
సహజంగా మార్చి మొదటి వారంలో పెరగాల్సిన ఎండలు.. ఫిబ్రవరి మొదటివారంలోనే మండిపోతుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎండలు ఎలా ఉంటాయోనని అందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులతో ఈ విధమైన పరిస్థితులు వస్తున్నాయని, ఈ ఏడాది వేసవిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.