నేటి నుంచి ఎంసెట్‌ రిజిస్ట్రేషన్‌ 

Eamcet registration from today - Sakshi

27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి జూలై 1 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో (tseamcet.nic.in)రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేలా ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. అలాగే ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కాగా, ఫీజులు పెంచాలని ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, వాటిపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఉంటాయా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలంటే కాలేజీల వారీగా ఫీజుల వివరాలను అందుబాటులో ఉంచా ల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈలోగా ఫీజుల వ్యవహా రంపై స్పష్టత వస్తే 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. లేదంటే కొంత ఆలస్యం కానుంది.  

ఎంచుకున్న సమయంలో వెరిఫికేషన్‌.. 
గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్ణీత తేదీల్లో నిర్ణీత ర్యాంకుల వారు, వారికి కేటాయించిన హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో చేయించుకునే వారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా తమకు సమీపంలో ఉన్న హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఎంచుకొని నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులకు 27వ తేదీ నుంచి జూలై 3 వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. ప్రతి గంటకు ఒక స్లాట్‌గా విభజించి వెరిఫికేషన్‌ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకొని నిర్ణీత తేదీలో నిర్ణీత సమయంలో తాము ఎంచుకున్న హెల్ప్‌లైన్‌ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని ప్రవేశాల క్యాంపు కార్యాలయ అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  

లక్ష మంది హాజరు.. 
ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం గత నెల 3, 4, 6 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్‌ రాసేందుకు 1,42,216 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వాటి ఫలితాలను ఎంసెట్‌ కమిటీ ఈ నెల 9న విడుదల చేసింది. అందులో 1,08,213 మంది అర్హత సాధించారు.  అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,989 మంది రిజిస్టర్‌ చేసు కోగా 68,550 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది అర్హత సాధించారు. ఎంసెట్‌ అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. 

నేటి నుంచి ఈసెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ సెకండియర్‌లో చేరేలా (లేటరల్‌ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 22 నుంచి ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి 26 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈసెట్‌ ద్వారా 10,221 సీట్లను ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌లో 2,421 సీట్లు, ఈసీఈలో 2,291, మెకానికల్‌లో 1,398, ఈఈఈలో 1,183, సివిల్‌లో 1,154, ఫార్మసీలో 1,015 సీట్లు, ఐటీలో 530 సీట్లు, ఇతర విభాగాల్లో మిగతా సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఈసెట్‌ వెబ్‌ఆప్షన్లు కూడా 24వ తేదీ నుంచి 27 వరకు ఇచ్చుకునేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాలేజీల వారీగా వివరాలు చూసుకొని విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top