మరో 983 మందికి కరోనా | Covid-19 Positive for another 983 people in Telangana | Sakshi
Sakshi News home page

మరో 983 మందికి కరోనా

Jun 29 2020 4:27 AM | Updated on Jun 29 2020 1:34 PM

Covid-19 Positive for another 983 people in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లలో చికిత్స పొందుతుం డగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నలుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 816 ఉండగా.. రంగారెడ్డిలో 47, మంచి ర్యాలలో 33, మేడ్చల్‌లో 29, వరంగల్‌ రూరల్‌లో 19, వరంగల్‌ అర్బన్‌లో 12, కొత్తగూడెంలో 5, కరీంనగర్, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,227 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 30% మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 82,458 మందికి పరీక్షలు నిర్వహించగా 17.48%మందికి పాజిటివ్‌ వచ్చింది.

బెల్లంపల్లిలో 30 మందికి పాజిటివ్‌..
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో  ఈనెల 24న అక్కడి ఐసోలేషన్‌ వార్డు నుంచి 47 మంది శాంపిల్స్‌ సేకరించి వరంగల్‌ ఎంజీఎంకు పంపించగా, ఆదివారం 31 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. వీరిలో బెల్లంపల్లి పట్టణానికి చెందినవారు 30 మంది ఉండగా, మందమర్రికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఓ సింగరేణి కార్మికుడి నుంచి వారందరికీ వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

కరోనాతో 7 నెలల బాలుడి మృతి
నారాయణఖేడ్‌: కరోనాతో నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట్‌ గ్రామానికి చెందిన 7 నెలల బాలుడు ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. పదిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 24న అతడికి పాజిటివ్‌ అని తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement